తెలంగాణ

telangana

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - సభలో మూడు శ్వేతపత్రాలు విడుదల - AP ASSEMBLY SESSIONS BEGINS TODAY

By ETV Bharat Telangana Team

Published : Jul 22, 2024, 8:17 AM IST

Assembly Sessions In Andhra Pradesh 2024 : ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించనున్నారు. దాదాపు 5 రోజుల పాటు జరిగే సమావేశాల్లో ప్రభుత్వం 3 శ్వేత పత్రాలను విడుదల చేయనుంది.

Andhra Pradesh Assembly Sessions 2024
Assembly Sessions In Andhra Pradesh 2024 (ETV Bharat)

Andhra Pradesh Assembly Sessions 2024: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్నాయి. మొదటి రోజు గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ వాయిదా అనంతరం స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ - బీఏసీ సమావేశం జరగనుంది. ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈనెల 26 వరకు అంటే 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశముంది. గవర్నర్‌ ప్రసంగంపై రేపు చర్చ జరగనుంది.

వైఎస్సార్​సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం రేపే సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు, ఎక్సైజ్‌ విధానం, రాష్ట్ర అప్పులు - ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. వీటిపై సభ్యులు చర్చించనున్నారు. ప్రతిపక్ష హోదాపై ఎలాంటి నిర్ణయం తీసుకోనందున ఈ సమావేశాల్లోనూ ఫ్రీ సీటింగ్‌ విధానాన్నే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

ఈ నెలాఖరుతో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ ముగియనున్నందున కొత్త బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉన్నా, ప్రస్తుత సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం లేదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులు, రాబడి తదితర అంశాలపై పూర్తి స్థాయి సమాచారం వచ్చాక అంతా అధ్యయనం చేసి అక్టోబర్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. అంతవరకు ఓటాన్‌ ఎకౌంట్ బడ్జెట్‌నే కొనసాగిస్తూ రాటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

5 ఏళ్ల తర్వాత మీడియా పాయింట్‌: శాసనసభ సమావేశాలకు సందర్శకులను అనుమతించరాదని నిర్ణయించారు. విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి మాత్రమే పాస్‌లు ఇవ్వనున్నారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకార సమయంలో సందర్శకులు పెద్దఎత్తున రావడంతో గ్యాలరీలు కిక్కిరిశాయి. గందరగోళ పరిస్థితుల కారణంగా సభ్యులకూ ఇబ్బంది కలిగింది. దీంతో ప్రస్తుత సమావేశాలకు సందర్శకులను వెంట తీసుకురావద్దని ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమాచారం. ఇక శాసనసభ మీడియా పాయింట్‌ను 5 ఏళ్ల తర్వాత పునరుద్ధరించారు. ఇక్కడి నుంచే ఎలక్ట్రానిక్‌ మీడియాకు ప్రసారాలు ఇవ్వనున్నారు.

అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించి సభకు వెళ్లడం తెలుగుదేశం పార్టీ సంప్రదాయంగా పెట్టుకుంది. ఉదయం సీఎం చంద్రబాబు నేతృత్యంలో పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి సభకు బయలుదేరతారు. సభ్యులంతా పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో రావాలని టీడీఎల్పీ సూచించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం టీడీపీ శాసనసభా పక్ష సమావేశం జరుగనుంది.

అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ పరంగా 3 శ్వేతపత్రాలు సభలో పెట్టి చర్చించనున్నందున ఆయా అంశాలపై ఎమ్మెల్యేలు పట్టు పెంచుకునేలా సూచనలు ఇవ్వనున్నారు. ప్రతిపక్షం లేనందున స్వపక్షమే ప్రజా సమస్యలపై సభలో లేవనెత్తి పరిష్కారం చూపేలా పలువురికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

దిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్‌ - నేడు రాహుల్ గాంధీతో భేటీ - CM Revanth Reddy Delhi Tour

నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు - అస్త్రశస్త్రాలతో సన్నద్ధమైన విపక్షాలు! - Budget Session Of Parliament

ABOUT THE AUTHOR

...view details