ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వెంటనే డిపాజిట్లు చెల్లించాలి' - అగ్రిగోల్డ్ బాధితుల మహా విజ్ఞాపన దీక్ష

విజయవాడ ధర్నాచౌక్‌లో అగ్రిగోల్డ్ బాధితుల మహా విజ్ఞాపన దీక్ష - సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ నియమించాలని డిమాండ్

Agri_Gold_Victims
AGRIGOLD VICTIMS PROTEST (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

AGRIGOLD VICTIMS PROTEST :అగ్రిగోల్డ్ బాధితులు మళ్లీ నిరసన బాట పట్టారు. విజయవాడలో ధర్నాచౌక్‌లో "మహా విజ్ఞాపన దీక్ష"కు దిగారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. 9 అంశాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని ప్రభుత్వం ఎదుట ఉంచుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని పలువురు నేతలు డిమాండ్‌ చేశారు.

విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదనతో మరోసారి మార్మోగింది. రాష్ట్రవ్యాప్తంగా వందలాదిమంది అగ్రిగోల్డ్ బాధితులు తరలివచ్చి మహా విజ్ఞాపన దీక్ష పేరిట దీక్షలో పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అగ్రిగోల్డ్ బాధితుల న్యాయమైన డిమాండ్లకు వారు తమ మద్దతును ప్రకటించారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేదు:గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు సరైన న్యాయం చేయలేదని బాధితులు నినాదాలు చేశారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వమైనా తమ సమస్యలను పరిష్కరించాలని, డిపాజిటర్ల సొమ్ము వెనక్కి ఇప్పించాలని కోరారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక, మానసిక ఒత్తిడిలో ఉన్న బాధితులకు సత్వరమే డిపాజిట్లు చెల్లించాలని కోరారు.

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మరో మలుపు - ఫోర్జరీ కోణం గుర్తించిన ఏసీబీ - Agri gold Land Issue

వడ్డీతో సహా చెల్లించాలి: అగ్రిగోల్డ్ కంపెనీ రిజిష్టర్ చేసిన ఖాతాదారుల ఇంటి స్థలాలు, భూముల్ని అటాచ్మెంట్ నుంచి తొలగించాలని, మరణించిన బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, అగ్రిగోల్డ్ అంశంపై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి కేసులను త్వరితగతిన పరిష్కరించాలని నినాదాలు చేశారు. కంపెనీకి చెందిన వేల కోట్లు ఆస్తులమ్మి ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును జమ చేసుకుని మిగిలిన సొమ్మును బాధితులకు వడ్డీతో సహా చెల్లించాలని బాధితులు కోరారు. ఎన్డీయే ప్రభుత్వంపై అగ్రిగోల్డ్ బాధితులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలని అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమసంఘం నాయకులు కోరారు.

అగ్రిగోల్డ్ ఆస్తులమ్మి బాధితులకు చెల్లించడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. నవంబరు మూడో వారంలో శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయని, అందులో అగ్రిగోల్డ్ అంశాన్ని వాయిదా తీర్మానం ద్వారా ప్రస్తావించనున్నామని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు చెప్పారు. బాధితులు కోరుతున్నట్లు అధికారులతో స్పెషల్ పర్పస్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసేటట్లు తమ ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఆర్థికంగా, మానసికంగా చితికిపోయిన అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని, పూర్తిస్థాయిలో డిపాజిట్ల సొమ్ము ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని బాధితులు విజ్ఞాపన చేస్తున్నారు.

"అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకుప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. ప్రత్యేక కమిటీలో సమర్థులైన అధికారులను ఉంచాలి. 26 జిల్లాల్లో తిరిగి బాధితుల సమస్యలు తెలుసుకుని కమిటీ పరిష్కరించాలి. అగ్రిగోల్డ్‌ ఆస్తులను పరిరక్షించాలి". - ముప్పాళ్ల నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు

అగ్రిగోల్డ్​ భూముల కబ్జా - మాజీ మంత్రి తనయుడు జోగి రాజీవ్‌ అరెస్ట్​ - Remand for Jogi Rajeev

ABOUT THE AUTHOR

...view details