తెలంగాణ

telangana

ట్రాఫిక్​ పోలీసుల సమయస్ఫూర్తి - ప్రాణాలతో బయటపడ్డ ఫ్యామిలీ - Traffic Police Who Saved A Family

By ETV Bharat Telangana Team

Published : Aug 17, 2024, 11:23 AM IST

Traffic Police Who Saved A Family : శుక్రవారం కురిసిన వర్షాలకు కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి కారులో ఉన్న ముగ్గురు చిన్నారులతో సహా ఓ కుటుంబాన్ని కాపాడారు.

Traffic Police Who Saved A Family
Traffic Police Who Saved A Family (ETV Bharat)

Traffic Police Who Saved A Family : రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది. పలుచోట్ల ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం కలిగింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పనామా వద్ద కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రాఫిక్ పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారులతో సహా ఓ కుటుంబాన్ని కాపాడారు.

ఇదీ జరిగింది :వనస్థలిపురం ట్రాఫిక్ సీ.ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం హయత్​నగర్​కు చెందిన జిల్లా వినోద్ తన భార్య, పిల్లలతో కలిసి హయత్ నగర్ నుంచి ఎల్బీనగర్ వైపునకు వర్షం పడుతోన్న సమయంలో కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో పనామా చౌరస్తా దగ్గరకు రాగానే వరద ఉద్ధృతికి కారు అదుపు తప్పి పక్కనే ఉన్న వర్షపు నీటితో నిండి ఉన్న నాలాలోకి దూసుకువెళ్లింది.

ఓ కుటుంబాన్ని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు :ఆ ప్రాంతంలోనే విధుల్లో ఉన్న వనస్థలిపురం ట్రాఫిక్ కానిస్టేబుళ్లు సైదులు, శ్రీనివాసరావు, సీ.ఐ వెంకటేశ్వర్లు కారు నాలాలో చిక్కుకున్న విషయం గమనించారు. వెంటనే స్పందించి సమయస్ఫూర్తితో వ్యవహరించి కారులో ఉన్న ముగ్గురు చిన్నారులతో సహా కుటుంబం మొత్తాన్ని సురక్షితంగా కాపాడారు. వరద ఉద్ధృతి తగ్గిన అనంతరం ఎక్స్కవేటర్ సాయంతో కారును నాలా నుంచి బయటకు తీశారు. గురువారం రాత్రికి కూడా ఇదే ప్రాంతంలో కారు కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో వెళ్లాలంటే వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు.

కారులో ఉన్నవారిని కాపాడిన సిబ్బందిని పోలీసు అధికారులు అభినందించారు. ట్రాఫక్ అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. వరద ఉద్ధృతి పూర్తిగా తగ్గిన తర్వాత వరదనీటిలో ఇరుక్కున్న కారును కూడా బయటకు తీయించారు.

Heavy Rains In Hyderabad :శుక్రవారం ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రధాన రహదారులపై వరద నీరు చేరి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రహదారులపై వరద నీరు ప్రవహించింది. చాలాచోట్ల వాహనాలు రోడ్లపై నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగింది.

అటు కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్‌, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, సనత్‌నగర్‌, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి, దిల్​సుఖ్​ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్​నగర్​లోనూ జడివాన కురిసింది. ఈ ప్రభావంతో రహదారులపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రద్దీ ప్రాంతాలైన అమీర్​పేట, పంజాగుట్ట, కూకట్​పల్లి, బయో డైవర్సిటీ, కోఠి ప్రాంతాల్లో ట్రాఫిక్​ రద్దీ ఎక్కువగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details