Paris Olympics 2024 Day 2 India:పారిస్ ఒలింపిక్స్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. స్టార్ షూటర్ మనూ బాకర్ 10మీటర్ల ఎయిర్ పిస్టర్ ఈవెంట్లో కాంస్యం ముద్దాడింది. దీంతో ప్రస్తుత ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో తొలి పతకం వచ్చి చేరింది. ఇక ఆయా అథ్లెట్లు కూడా రెండో రోజు మెరుగైన ప్రదర్శన చేశారు. పలు క్రీడల్లో క్వాలిఫయర్, రౌండ్ ఈవెంట్లలో సత్తా చాటారు. రెండో రోజు భారత అథ్లెట్లు హైలైట్స్ ఇవే!
బ్యాడ్మింటన్
స్టార్ షట్లర్ పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం చేసింది. తొలిమ్యాచ్లో మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి అబ్దుల్ రజాక్ పై 21-9, 21-6 తేడాతో అలవోక విజయం సాధించి తర్వాతి రౌండ్కు అర్హత సాధించింది. జులై 31న క్రిస్టిన్ కుబ్బాతో పోటీ పడాల్సి ఉంది. మరోవైపు పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్లో ఎస్ ప్రణయ్ కూడా శుభారంభం చేశాడు. అతడు జర్మనీ షట్లర్ ఫాబియన్ రోత్పై 21-18, 21-12 తేడాతో నెగ్గాడు. ఇక 31 జులైన ప్రణయ్ తదుపరి మ్యాచ్ ఆడనున్నాడు.
షూటింగ్
పారిస్ ఒలింపిక్స్లో తొలిరోజు నిరాశపరిచిన భారత షూటర్లు రెండోరోజు సత్తా చాటారు. పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా ఫైనల్కు చేరాడు. 630.1 పాయింట్లతో ఏడోస్థానంలో నిలిచి తుదిపోరుకు అర్హత సాధించాడు. మరో యువ షూటర్ రమితా జిందాల్ పతకానికి గురిపెట్టింది. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో ఫైనల్కు దూసుకెళ్లింది. 631.5 పాయింట్లతో రమిత ఐదోస్థానంలో నిలిచి ఫైనల్లో చోటు దక్కించుకుంది. ఇదే ఈవెంట్లో స్టార్ షూటర్ ఇలవెనిల్ వలరివన్ 630.7పాయింట్లతో పదో స్థానంలో నిలిచి ఫైనల్కు చేరడంలో విఫలమైంది.
స్విమ్మింగ్
అటు స్విమ్మింగ్ వంద మీటర్ల బ్యాక్స్ట్రోక్ హీట్స్ విభాగంలో భారత్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. 55.01 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఇక రోయింగ్లో రిపెఛేజ్ విభాగంలో భారత అథ్లెట్ బాల్ రాజ్ పన్వార్ సత్తా చాటాడు. రెండోరౌండ్ లో అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. 7నిమిషాల 12.41 సెకన్లలో పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచాడు.