Olympics Effect On Paris Tourism: ఒలింపిక్స్ నిర్వహణకు ఆతిథ్య దేశాలు భారీగా ఖర్చు చేయాలి. స్టేడియాలను నిర్మించడానికి, సౌకర్యాలు, మెరుగైన భద్రత కల్పించడానికి పెద్ద మొత్తంలో వెచ్చించాలి. అయితే ఆతిథ్య దేశాలకు ఈ ఆర్థిక భారాలు ఎలా ఉన్నా, టూరిజం ఆకర్షణీయంగా మారుతుందన్న సంతృప్తి దక్కేది. రెండు వారాల పాటు జరిగే అతిపెద్ద క్రీడా మహోత్సవం చూసేందుకు ప్రపంచ దేశాల నుంచి ప్రజలు తరలి వచ్చేవారు.
అయితే ఇప్పుడు ఫ్రాన్స్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మామూలుగా కంటే పర్యాటకుల రద్దీ తక్కువైంది. టూరిస్ట్లు రూటు మారుస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులకు ఐరోపాలోని టాప్ డెస్టినేషన్స్లో ఫ్రాన్స్ ఒకటి. ఇక్కడి ఈఫిల్ టవర్, ఇతర చారిత్రక ప్రాంతాలు చూసేందుకు ఏటా మిలియన్ల మంది సందర్శకులు వస్తుంటారు. అయితే ప్రస్తుతం ఒలింపిక్స్ జరుగుతున్నా, ఫ్రాన్స్ పర్యాటకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. పర్యాటకుల సంఖ్య పెరగకపోవడం అటుంచితే గతేడాది కంటే తగ్గుతోంది.
తగ్గిన పర్యాటకులు
ఒక నివేదిక ప్రకారం, ఫ్రాన్స్కు పారిస్ 2024 ఒలింపిక్స్ ఆర్థిక గందరగోళంగా మారుతోంది. ఎందుకంటే దేశం పర్యాటక ప్రయోజనాల్లో ఆశించిన మార్పులు కనిపించడం లేదు. హోటల్ బుకింగ్లు, విమానాలు, ట్రావెల్ అడ్వైజర్లకు పెద్దగా డిమాండ్ పెరగలేదు. ప్రస్తుత త్రైమాసికంలో ఎయిర్ ఫ్రాన్స్ €180 మిలియన్ల నష్టాన్ని నమోదు చేసిందని నివేదిక పేర్కొంది. ఆ రెండు వారాల వ్యవధిలో దేశం సాధారణం కంటే ఎక్కువ రద్దీగా ఉంటుందని పర్యాటకులు భావిస్తుండం వల్ల, అంతర్జాతీయ ప్రయాణికులు ఒలింపిక్స్ కారణంగా ఫ్రాన్స్కు రావడం మానుకుంటున్నారు.