India Vs Australia Border Gavaskar Trophy 2nd Test : ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీ సిరీస్లో భాగంగా శుక్రవారం రెండో టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్ వేదికగా ప్రారంభంకానున్న డే అండ్ నైట్ టెస్టు కోసం ఇరుజట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో విజయం, ఆపై పింక్ బాల్తో ఆస్ట్రేలియా PM ఎలెవన్ జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో గెలుపొంది టీమ్ఇండియా జోరు మీదుంది.
నాలుగేళ్ల క్రితం గత పర్యటనలో ఇదే వేదికపై జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత్ 36 పరుగులకే ఆలౌటై అవమానకరమైన ఓటమిని చవిచూసింది. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఆటగాళ్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ అందుబాటులోకి రావడం భారత్కు కలిసొచ్చే అంశం.
అడిలైడ్ పిచ్ స్పిన్నర్లకూ సహకరిస్తుందని ప్రధాన క్యురేటర్ డామియన్ హో చెప్పారు. పచ్చిక వల్ల ఆరంభంలో పేసర్లకు అనుకూలిస్తుందని తెలిపారు. పిచ్పై 6 మిల్లీమీటర్ల పచ్చిక ఉంటుందని ఆరంభంలో పేస్, బౌన్స్కు సహకరిస్తుందని వెల్లడించారు. రోజులు గడుస్తున్నకొద్దీ స్పిన్నర్లు కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. కొత్త బంతితో ప్లడ్ లైట్ల కింద బ్యాటింగ్ చేయడం బ్యాటర్లకు కష్టంగా మారుతుందని డామియన్ హగ్ పేర్కొన్నారు.
కుటుంబ కారణాలతో తొలి టెస్టుకు దూరమైన రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రావడం వల్ల జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఉంటాయి. గాయం నుంచి కోలుకున్న శుభమన్ గిల్తో పాటు రోహిత్ తిరిగి జట్టులోకి రావడం వల్ల తొలిటెస్టులో విఫలమైన పడిక్కల్, ధ్రువ్ జురెల్లు బెంచ్కే పరిమితం కానున్నారు.