IND vs ENG T20 Series : ఇంగ్లాండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే ఈ గేమ్లో భారత యంగ్ పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం మాత్రం కాస్త విచిత్రంగా జరిగింది. ఈ నేపథ్యంలో తనకు ఈ మ్యాచ్లో ఆడే అవకాశం రావడం గురించి హర్షిత్ స్పందించాడు. కంకషన్ సబ్గా ఆడాలనే సమాచారం ఎప్పుడు తెలిసిందన్న విషయం గురించి మాట్లాడాడు.
"నాకు ఇప్పటికీ ఇది ఓ డ్రీమ్ డెబ్యూట్. దూబె డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చిన రెండు ఓవర్ల తర్వాతనే నాకు ఈ విషయం గురించి తెలిసింది. కంకషన్ సబ్స్టిట్యూట్గా ఆడాలని, దానికి సిద్ధంగా ఉండమని చెప్పారు. అయితే నేను కేవలం ఈ సిరీస్ కోసమే కాదు ఎన్నో ఏళ్లుగా భారత టీ20 జట్టులోకి అడుగు పెట్టేందుకు నేను ఎంతగానో వేచి ఉన్నాను. ఇప్పుడు నాకు ఈ ఛాన్స్ వచ్చింది. అందుకే నన్ను నేను ఎలాగైనా నిరూపించుకోవాలని భావించాను. ఐపీఎల్లో మంచి బౌలింగ్ స్కిల్స్తోనే ఆడాను. ఇప్పుడూ అలాగే బౌలింగ్ చేసి ఫలితాలను సాధించాను" అని హర్షిత్ ఆనందం వ్యక్తం చేశాడు. భారత ఇన్నింగ్స్లో చివరి ఓవర్లో దూబె హెల్మెట్కు బంతి బలంగా తాకింది. అందుకే ఫీల్డింగ్ సమయంలో తనకు బదులు హర్షిత్ను మేనేజ్మెంట్ తీసుకుంది.
అయితే శివమ్ దూబెకు బదులుగా హర్షిత్ను కంకషన్ సబ్స్టిట్యూట్గా తీసుకోవడం పట్ల ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఫీల్డ్ అంపైర్లతో మాట్లాడినప్పటికీ ఫలితం మాత్రం భారత్కు అనుకూలంగా వచ్చింది. దీంతో మ్యాచ్ తర్వాత బట్లర్ ఈ విషయంపై స్పందించాడు. "ఈ రిప్లేస్మెంట్ ఏ మాత్రం సరైనది కాదు. మేం దీంతో అస్సలు ఏకీభవించట్లేదు. మాతో వాళ్లు ఏ మాత్రం సంప్రదించలేదు. నేను బ్యాటింగ్కు వచ్చిన సమయంలో హర్షిత్ ఎందుకు ఫీల్డింగ్లో ఉన్నాడు? అని అడిగాను. దానికి వాళ్లు కంకషన్ సబ్ అని బదులిచ్చారు. మ్యాచ్ రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దీనిపై జవగళ్ శ్రీనాథ్ను క్లారిటీ ఇవ్వాలని అడుగుతాం" అని జోస్ అన్నాడు.