Vasant Panchami 2025 Special Prasadam: ప్రతీ సంవత్సరం మాఘ మాసం శుక్ల పక్షం ఐదవ రోజున వసంత పంచమిని జరుపుకుంటారు. ఈ పండగ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవిని పూజిస్తారు. అమ్మవారిని ఆరాధిస్తే మంచి జ్ఞానం, చదువు వస్తుందని భక్తుల విశ్వాసం. వసంత పంచమిని పలు ప్రాంతాల్లో బసంత్ పంచమి, శ్రీ పంచమి, సరస్వతీ పంచమి, మాఘశుద్ధ పంచమి అని కూడా పిలుస్తారు. ఈ పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఫిబ్రవరి 2 వసంత పంచమిని పురస్కరించుకుని అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
కేసర్ శ్రీఖండ్:
కావాల్సిన పదార్థాలు:
- బాగా మీగడ కలిగిన చిక్కటి పెరుగు - 1 కప్పు
- పంచదార - అర కప్పు
- కుంకుమపువ్వు- పావు టీస్పూన్
- పాలు - 1 టేబుల్ స్పూన్
- యాలకుల పొడి- పావు టీస్పూన్
- గార్నిష్ కోసం బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్
తయారీ విధానం:
- గిన్నెలోకి పాలు తీసుకుని అందులో కుంకుమ పువ్వు వేసి ఓ అరగంట సేపు నాననివ్వాలి.
- ఇప్పుడు ఓ బౌల్లోకి పెరుగు వేసి చిక్కగా, మృదువుగా మారేవరకు విస్కర్తో బీట్ చేయాలి.
- పెరుగు బాగా కలిపిన తర్వాత పంచదార వేసి అది కరిగే వరకు బీట్ చేయాలి.
- ఆ తర్వాత కుంకుమపువ్వు పాలు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని కనీసం 2 గంటలు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి.
- ఆ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసి డ్రైఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే కేసర్ శ్రీఖండ్ రెడీ. దీనిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత తినాలి.
బేసన్ హల్వా:
కావాల్సిన పదార్థాలు:
- శనగపిండి - 1 కప్పు
- నెయ్యి - 1 కప్పు
- బొంబాయి రవ్వ - 2 టేబుల్ స్పూన్లు
- డ్రై ఫ్రూట్స్- పావు కప్పు(జీడిపప్పు, బాదం, పిస్తా సన్నగా కట్ చేసుకోవాలి)
- పంచదార పొడి - అర కప్పు
- వేడి నీరు - అర కప్పు
- యాలకుల పొడి - అర టీ స్పూన్
తయారీ విధానం:
- స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి పెట్టి పావు కప్పు నెయ్యి పోసుకోవాలి. నెయ్యి ఒకేసారి కాకుండా హల్వా తయారయ్యేంతవరకు కొద్దికొద్దిగా పోసుకుంటుండాలి.
- నెయ్యి కాగిన తర్వాత శనగపిండి వేడి మీడియం ఫ్లేమ్లో శనగపిండి రంగు మారే వరకు కలుపుతూ వేయించుకోవాలి.
- ఆ తర్వాత బొంబాయి రవ్వు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మరికొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుతూ వేయించుకోవాలి.
- శనగపిండి కలర్ మారి మంచి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత పంచదార పొడి వేసి మరోసారి బాగా కలపాలి.
- ఆ తర్వాత అందులోకి వేడి నీరు పోసి బాగా కలిపి ఉడికించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత శనగపిండి బాగా మగ్గి నెయ్యి పైకి తేలుతూ పాన్కు అంటుకోకుండా ఉంటుంది. అప్పుడు యాలకుల పొడి వేసి మరో రెండు నిమిషాలు కలుపుకోవాలి.
- మిశ్రమం దగ్గరపడినప్పుడు దింపేముందు సన్నగా కట్ చేసిన డ్రైఫ్రూట్స్, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలు బేసన్ హల్వా రెడీ.
"నవ నారసింహ క్షేత్రాలు" ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా? - పూర్తి లిస్ట్, విశిష్టత మీ కోసం!