Delhi Election Results 2025 : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా, దాదాపు 27 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కన్పిస్తుండగా, మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో కమలదళం ఆధిక్యంలో కొనసాగుతోంది. దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ (36)ను దాటేసి అత్యధిక మెజార్టీలో కనబరుస్తోంది.
ఉదయం 10 గంటల వరకు వెలువడిన ఫలితాలను చూస్తుంటే, ప్రస్తుతం కమలం పార్టీ 39 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 31 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. నాలుగోసారి అధికారం చేపట్టాలనుకున్న ఆప్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ తొలుత ఒక చోట ముందంజలో ఉన్నట్లే కన్పించినా ఆ తర్వాత వెనుకంజలోకి పడిపోయింది. ఏ స్థానంలోనూ హస్తం పార్టీ ప్రభావం చూపలేకపోయింది.
ప్రముఖుల ఫలితాల సరళి ఎలా ఉందంటే?
- న్యూదిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్ ముందంజ
- కాల్కాజీ స్థానంలో దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ వెనుకంజ
- జంగ్పురలో ఆప్ నేత మనీశ్ సిసోదియా ముందంజ
- షాకుర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్ ముందంజ
- ఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్ వెనుకంజ
- గాంధీనగర్లో బీజేపీ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ ముందంజ
- బద్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ వెనుకంజ
- బిజ్వాసన్ స్థానంలో బీజేపీ అభ్యర్థి కైలాష్ గహ్లోత్ ముందంజ
- పత్పర్గంజ్లో ఆప్ అభ్యర్థి అవధ్ ఓజా వెనుకంజ
- గ్రేటర్ కైలాశ్లో ఆప్ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ ముందంజ
కాగా, దిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరిగింది. 60.42 శాతం ఓటింగ్ నమోదైంది. క్రితం ఎన్నికల కంటే ఇది 1.56 శాతం తక్కువ. కాగా, ఈసారి ఎవరు గెలుస్తారో మరికొన్ని గంటల్లో తేలనుంది.