Gagan Narang Paris Olympics 2024 :ఈ ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయరంటూ 'చెఫ్ ది మిషన్' గగన్ నారంగ్ తాజాగా మీడియాతో వెల్లడించారు. 2024 ఒలింపిక్స్లో భారత బృందానికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న ఆయన, గతంకంటే ఇప్పుడే అథ్లెట్ల మైండ్సెట్ బాగా మారిపోయిందంటూ పేర్కొన్నారు. తాము కూడా వారిని మంచి పెర్ఫామెన్స్ చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు గగన్ నారంగ్ వెల్లడించారు.
"ఇప్పుడు మన క్రీడాకారులకు అందుతున్న ప్రోత్సాహంలో ఎన్నో మార్పులు వచ్చాయి. వారి ఆలోచనా విధానం కూడా ఉన్నతస్థాయికి చేరుకుంది. గతంలో ఒలింపిక్స్ అనగానే చాలా మేమంతా ఎంతో ఆందోళనకు గురయ్యేవాళ్లం. ఇతర దేశాలతో పోలిస్తే మాలో కాన్ఫిడెన్స్ కూడా తక్కువగానే ఉండేది. ఇప్పుడు మాత్రం అలా కాదు. మా మైండ్సెట్ పూర్తిగా మారిపోయింది. వారికి పోటీ ఇచ్చేలా సమాయత్తం కావడే మాకు కలిసొచ్చే అంశంగా ఉంది. ప్రజలు కూడా ఈ క్రీడలను ఆస్వాదించడాన్ని ప్రారంభించారు. వారి కోసమైనా గొప్పగా పెర్ఫామ్ చేయాలని అథ్లెట్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కేవలం గేమ్స్లో పాల్గొనడమే కాకుండా, అత్యుత్తమ పెర్ఫామెన్స్తో పతకాలను సాధించడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు. ఎవరూ తమకంటే బెటర్ అని అనుకోవట్లేదు. ఏదో ఒక పతకాన్ని సాధించాలని రాజీ పడట్లేదు. భారత్కు గోల్డ్ తెచ్చిపెట్టడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మరోవైపు కేంద్రం నుంచి క్రీడాకారులకు దక్కుతున్న ప్రోత్సాహం గతంలో ఎప్పుడూ చూడలేదని గగన్ అన్నారు. గత కొన్నేళ్లుగా మద్దతు పెరుగుతూ వచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.