తెలంగాణ

telangana

ETV Bharat / sports

నవానగర్‌ మహారాజుగా భారత మాజీ క్రికెటర్‌

నవానగర్‌ సంస్థానానికి కాబోయే మహారాజు(జామ్‌సాహెబ్‌)గా భారత మాజీ క్రికెటర్‌!

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

Ajay Jadeja Nawanagar Jamsaheb
Ajay Jadeja Nawanagar Jamsaheb (source IANS and ANI)

Ajay Jadeja Nawanagar Jamsaheb : జామ్ నగర్ రాజ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రాజ కుటుంబానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గౌరవం ఉంది. అయితే తాజాగా ఈ రాయల్ ఫ్యామిలీ కీలక ప్రకటన చేసింది. విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ క్రికెటర్​ అజయ్ జడేజాను తన కుటుంబ వారసుడిగా ప్రకటించింది. నవానగర్‌(జామ్ నగర్ పాత పేరు) సంస్థానానికి కాబోయే మహారాజు(జామ్‌సాహెబ్‌)గా జడేజా పేరును ప్రకటించింది. ప్రస్తుత జామ్​ సాహెబ్​ శత్రుసల్యసింహ్​జీ దిగ్విజయ్​ సింహ్​​జీ ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. దీంతో అజయ్‌ జడేజా నవానగర్‌ మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నారు.

"పాండవులు తమ 14 సంవత్సరాల అజ్ఞాత వాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని విజయం సాధించిన రోజు దసరా. ఈ రోజు, అజయ్ జడేజా నా వారసుడిగా, నవానగర్ తదుపరి జంసాహెబ్‌గా ఉండటానికి అంగీకరించినందున నేను కూడా విజయం సాధించినట్లు భావిస్తున్నాను, ఇది జామ్‌నగర్ ప్రజలకు గొప్ప వరం అని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్యూ జడేజా." అని శత్రుసల్యసింహ్​జీ అన్నారు.

కాగా, ఒకప్పటి ప్రిన్స్‌లీ స్టేట్‌ నవానగర్‌నే ప్రస్తుతం జామ్‌ నగర్‌గా పిలుస్తున్నారు. దేశంలో రాచరిక వ్యవస్థ అంతమైనప్పటికీ గుజరాత్‌లోని ఈ ప్రాంతంలో రాజకుటుంబ పాలన ఇంకా కొనసాగుతూనే ఉంది. జామ్‌నగర్ రాజ కుటుంబానికి చెందిన వాడే అజయ్ జడేజా కూడా. అతడు క్రికెట్‌పై ఉన్న మక్కువతో మైదానంలో అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. ఇంకా జామ్‌ నగర్ కుటుంబంలో గర్వించదగిన గొప్ప క్రికెట్ వారసత్వం ఉంది. ఈ కుటంబానికి చెందిన కేఎస్​ రంజిత్‌ సింహ్​జీ, కేఎస్​ దులీప్‌ సింహ్​జీ పేర్లనే రంజీ, దులీప్ ట్రోఫీగా నామకరణం చేశారు.

అజయ్ జడేజా తన కెరీర్​లో మంచి ప్రదర్శన చేసి లెజెండ్​గా ఎదిగాడు. 1992 నుంచి 2000 వరకు టీమ్​ ఇండియాకు ప్రాతినిథ్యం వహించిన అతడు 15 టెస్ట్​ మ్యాచులు, 196 వన్డేలు ఆడాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయడం, సింగిల్‌ వచ్చేచోట రెండో పరుగు తీయడం లాంటివి చేయడం అజయ్ జడేజా స్పెషాలిటీ.

బెంగళూరు వేదికగా జరిగిన 1996 వరల్డ్ కప్​ క్వార్టర్ ఫైనల్​లో జడేజా ఆడిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్​లో పాకిస్థాన్​పై టీమ్ ఇండియా గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో 40 పరుగులు కేవలం వకార్ యూనిస్ వేసిన చివరి రెండు ఓవర్లలోనే సాధించడం విశేషం.

కేవలం బ్యాటింగ్​లోనే కాదు ఫీల్డింగ్​లోనూ అజయ్ జడేజా తనదైన ముద్ర వేశాడు. గాల్లోకి అమాంతం ఎగరి క్యాచ్​ పట్టడం, ఒంటి చేతి క్యాచ్‌లు, సింగిల్‌ స్టంప్‌ వ్యూ రనౌట్‌లు లాంటివి ఎన్నో చేశాడు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్ జట్టుకు మెంటార్​గా పనిచేస్తున్నాడు. ప్రపంచ క్రికెట్​లో మరింత ఎదిగేలా తన అనుభవాన్ని ఉపయోగించి అఫ్గాన్ జట్టును తీర్చిదిద్దుతున్నాడు జడేజా.

బోర్డర్ గావస్కర్‌ ట్రోఫీ - రోహిత్‌ దూరమైతే జట్టు ఎదుర్కొనే 3 సమస్యలు ఇవే!

ఉప్పల్‌ టీ20కు వర్షం పడుతుందా? - క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమ్​ ఇండియా!

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details