2024-25 Border Gavaskar Trophy:2024- 25 బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి భారత్- ఆస్ట్రేలియా జట్లు సంసిద్ధమవుతున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా నవంబర్లో ఈ ప్రతిష్ఠాత్మకమైన ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఆతిథ్య ఆసీస్తో టీమ్ఇండియా 5 మ్యాచ్లు ఆడనుంది. అయితే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో నెం 1, నెం 2 స్థానాల్లో ఉన్న ఈ రెండు అత్యుత్తమ జట్ల మధ్య హై వోల్టేజ్ పోటీని చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఆసీస్ గడ్డపై జరిగిన గత రెండు ఎడిషన్లలో (2018- 19), (2020- 21) టీమ్ఇండియా విజయం సాధించింది. ఈసారి కూడా ఇదే జోరులో విజయ సాధించాలని భారత్ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమ్ఇండియా కొంత కాలంగా విదేశీ గడ్డలపై ఆడేందుకు బెదరడం లేదని అన్నాడు.
'2020- 21లో భారత్ గబ్బా మైదానంలో జయ కేతనం ఎగురవేసింది. ఆ మైదానంలో భారత్ నెగ్గడం అదే తొలిసారి. ఈ మధ్య కాలంలో టీమ్ఇండియా విదేశాల్లోనూ అద్భుతంగా రాణిస్తోంది. ఆ జట్టు బ్యాటర్లు విదేశీ పిచ్ల పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటున్నారు. ఒకప్పటిలా కాకుండా గబ్బా, ఓవర్ పిచ్లపై కూడా అదరగొడుతున్నారు. బహుశా అది జట్టు ఎంపికపై ఆధారపడి ఉంటుందేమో' అని పాంటింగ్ ఓ స్పోర్ట్స్ ఛానెల్ ప్రజెంటేషన్లో అన్నాడు.