Makara Jyothi 2025 Date And Time Sabarimala : మకర జ్యోతి అనేది ఏటా జనవరి 14న మకర సంక్రాంతి రోజున సాయంత్రం ఆకాశంలో కనిపించే దివ్యమైన కాంతిపుంజం! ఇది కేరళ రాష్ట్రంలోని శబరిమలకు ఎదురుగా ఉన్న కందమల శిఖరంపై కనిపిస్తుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు ఏటా 41 రోజులు ఉపవాస దీక్ష చేసి శబరిమలకు వెళ్తారు.
జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం
సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామియే తన భక్తులను ఆశీర్వదించడానికి మకర జ్యోతిగా దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం. శబరిమలలో సంక్రాంతి రోజున 'మకర జ్యోతి'ని వీక్షించటానికి వేలాది భక్తులు పోటెత్తుతారు. సంక్రాంతి రోజున సాయం సమయంలో కనిపించే మకరజ్యోతిని చూశాక అయ్యప్ప మాలధారులు దీక్ష విరమిస్తారు. ఈ సందర్భంగా మకరజ్యోతి విశేషాలను తెలుసుకుందాం.
మకరజ్యోతి ఏంటి? మకరవిళక్కు ఏంటి?
2011లో మకరజ్యోతి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కొంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సందర్భంగా అప్పటి వరకు లేని విధంగా మకరజ్యోతి విశ్వసనీయతపై సందేహాలు తలెత్తాయి. శబరిమల ఆలయం ప్రధానార్చకుడు చెప్పిన ప్రకారం మకరజ్యోతి మానవులు వెలిగించేది కాదు. అదొక దివ్య నక్షత్రం. మకర విళక్కు అంటే కొండపై నుంచి మూడుసార్లు కనిపించే దీపమని, పొన్నంబళమేడు పర్వతంపైన చేసే ఒక దీపారాధన అని తేలింది. అయితే హేతువాద సంస్థలు మాత్రం ఇందుకు అంగీకరించకుండా మకరజ్యోతి నిజం కాదని, అది దేవుడి మహిమ కాదని, ఈ జ్యోతి మానవులే వెలిగిస్తున్నారని వాదిస్తున్నారు.
జ్యోతి స్వరూపం
ఏది ఏమైనా సాక్షాత్తూ ఆ సుబ్రహ్మణ్యుని స్వరూపమే అయ్యప్ప స్వామి అని హిందువులు విశ్వసిస్తారు. స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు జ్యోతి స్వరూపమని స్పష్టమవుతోంది. సుబ్రహ్మణ్యుడే అయ్యప్ప కాబట్టి మకర జ్యోతి రూపంలో దర్శనమిచ్చేది అయ్యప్ప స్వామియే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రామాయణంలోనూ శబరిమల ప్రస్తావన
పురాణాల ప్రకారం శబరిమల ఆలయాన్ని పరశురాముడు స్థాపించారన్నది విశ్వాసం. శబరిమల ప్రస్తావన రామాయణంలో కూడా ఉంది. రాముడు పంపాకు, శబరిమల వద్ద శబరి ఆశ్రమానికి వెళ్లినట్లు నమ్ముతారు. ప్రాచీన కాలంలో పొన్నంబళమేడు మీద ఒక ఆలయం ఉంది. ఆ ఆలయ శిథిలాలు 'శివలింగం' సహా ఇటీవలి కాలం వరకూ అక్కడ ఉన్నాయి. అక్కడ ఒక చెరువు కూడా ఉంది.