తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Jun 5, 2024, 1:18 PM IST

ETV Bharat / politics

జనాగ్రహానికి నేలకరిచిన నియంత - కుప్పకూలిన జగన్‌ నిరంకుశ రాజ్యం - YSRCP Defeat In Assembly Elections

YSRCP Defeat in Assembly Elections in AP : జగన్​ రూపంలో రాష్ట్రానికి దాపురించిన పీడ విరగడైన విశేష సమయమిది! జనం తిరగబడి, ప్రభంజనమై విరుచుకుపడి జగన్​ నిరంకుశ రాజ్యాన్ని కుప్పకూల్చింది. పాలకులు యజమానులు కారు, ప్రజాసేవకులు మాత్రమే చెప్పిన చారిత్రక సంఘటన.

AP Assembly Results 2024
YSRCP Defeat in Assembly Elections in AP (ETV Bharat)

జనాగ్రహానికి నేలకరిచిన నియంత - కుప్పకూలిన జగన్‌ నిరంకుశ రాజ్యం (ETV Bharat)

YSRCP Defeat in Assembly Elections in AP :పాలకులు ప్రజా సేవకులే తప్ప యజమానులు కాదు! ఆ వాస్తవాన్ని విస్మరించి పాపిష్టి ఫాసిస్టులా మారిన జగన్‌ పీడను జనం వదిలించుకున్నారు! అలవిమాలిన అహంకారం, లెక్కాపత్రంలేని స్వాహాపర్వాలతో రాష్ట్రానికి వినాశకారిగా పరిణమించిన జగన్మోహన్‌రెడ్డిని శంకరగిరి మాన్యాలు పట్టించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్ల విజ్ఞతకు జేజేలు! ఒక నియంత బారి నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న ఆంధ్రావని చైతన్యశీలతకు వేనవేల వందనాలు! ఇది ఐదుకోట్ల ఆంధ్రుల సమష్టి విజయం! జనం తిరగబడి, ప్రభంజనమై విరుచుకుపడి, జగన్ నిరంకుశ రాజ్యాన్ని కుప్పకూల్చిన చారిత్రక సందర్భం.

స్వర్ణాంధ్రను శిథిలం చేసి, అన్ని వర్గాలనూ వెంటాడి వేధించిన జగన్ వికృత వ్యక్తిత్వంపై పోటెత్తిన ప్రజాగ్రహమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం! వైఎస్సార్సీపీ భ్రష్టపాలనపై మూడోకన్ను తెరిచిన జనసామాన్యం రాష్ట్రాన్ని పునర్నిర్మించే గురుతర బాధ్యతను 164 సీట్ల అఖండ మెజార్టీతో కూటమి నేతల చేతుల్లో పెట్టింది. 'ఒక్క ఛాన్స్​ ఇవ్వండి మంచి పరిపాలన అందిస్తాను' అంటూ ఊదరగొట్టి 2019 ఎన్నికల్లో గద్దెనెక్కిన జగన్‌ కనీసం రోడ్లు కూడా వేయలేదు.

'గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా'గా ఏపీ : పరిశ్రమలను తీసుకురాలేదు. యువతకు ఉపాధి చూపించలేదు! రైతులకు సాగునీరు ఇవ్వలేదు. దళిత, గిరిజనులకు కనీస భద్రత కల్పించలేదు! ఇవేమీ చేయని జగన్ విషపూరితమైన 'జె' బ్రాండ్ మద్యంతో ప్రజారోగ్యాన్ని పొట్టనపెట్టుకున్నారు. ఏపీని 'గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా'గా మార్చారు. వైఎస్సార్సీపీ ప్రబుద్ధులంతా కలిసి ఇసుక, మట్టి, విలువైన ఖనిజాల దోపిడీ, మద్యం దందాలూ భూముల కబ్జాలతో రాష్ట్రాన్ని యథేచ్ఛగా కొల్లగొట్టారు. ఆ అరాచకాలకు ప్రతిఫలంగానే జగన్ పార్టీని ఏపీ ప్రజలు అధఃపాతాళానికి తొక్కేశారు.

ఏపీని అన్ని రంగాల్లో కటిక చీకట్లలోకి లాక్కుపోయిన వైఎస్సార్సీపీ సర్కారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హతమార్చింది. రాక్షసత్వంలో జగన్‌కు సరిజోడులై, తోడుదొంగలై ఏపీని పీల్చిపిప్పి చేసిన వైఎస్సార్సపీ అసురులపై ఆంధ్ర ప్రజానీకం కసితీరా వేటేసింది. జగన్ సర్కార్​ పాతకాల కారణంగా ఏపీలో కొడిగట్టుకుపోయిన అభివృద్ధిని మళ్లీ పరుగులు తీయించడం కొత్త ప్రభుత్వానికి కత్తిమీద సాము కానుంది. రాష్ట్ర రుణభారాన్ని దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలకు చేర్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏపీని దివాలా అంచులకు ఈడ్చుకుపోయింది.

అభివృద్ధి సంక్షేమాలను జోడెడ్లుగా నడిపించడం కూటమి సర్కారుకు సవాలే! :ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే 25 వేల కోట్ల రూపాయల వరకు అప్పుల ముష్టెత్తిన సర్కారు ఆర్థిక క్రమశిక్షణకు సమాధి కట్టింది. దాన్ని గాడినపెట్టడం, రాష్ట్రాదాయాన్ని పెంచుతూ అభివృద్ధి సంక్షేమాలను జోడెడ్లుగా నడిపించడం కూటమి సర్కారుకు పెద్దసవాలే! పన్నుల భారం పెంచకుండా సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో, జనం జేబులకు చిల్లి పెట్టేందుకు జగన్ వేసిన చెత్తపన్నులు తొలగించడమూ అంతే ప్రధానం.

రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల పనులను జగన్ ప్రభుత్వం అటకెక్కించింది. జలయజ్ఞానికి జెల్లకొట్టడం వల్ల ప్రాజక్టుల నిర్మాణ వ్యయం తడిసిమోపెడు కానుంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలంటే సుమారు రూ.95 వేల కోట్లు అవసరం అవుతాయి. ఆ నిధులు సమీకరించడం, జలయజ్ఞం పనులను వేగవంతం చేయడం కూటమి సర్కారుకు అగ్నిపరీక్షే! రాష్ట్రాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కాణాచి కావాల్సిన అమరావతిని జగన్ సర్వనాశనం చేశారు. ఆయన చేతుల్లో చితికిపోయిన రాజధాని నగరానికి మళ్లీ జీవంపోసే బృహత్తర కర్తవ్యంలో నూతన సర్కారు నెగ్గుకురావడమూ కత్తిమీద సామే!.

Hello AP Bye Bye YCP : అధికారంలో ఉన్న అయిదేళ్లలో అక్రమాలకు, అరాచకాలకు తెగబడటమే తప్ప ప్రజావసరాలను జగన్ తీర్చిందే లేదు. మాయమాటలతో జనాన్ని బులిపిస్తూ, అడ్డగోలు వాదనలతో అందరినీ బుకాయిస్తూ జగన్ ముఠా సాగించిన దోపిడీ అంతా ఇంతా కాదు. వైఎస్సార్సీపీ నేతల అవినీతి మేతలను లోతుగా విచారించి, వారు స్వాహాచేసిన జనం సొమ్మును అణాపైసలతో సహా కక్కించాల్సింది కొత్త ప్రభుత్వమే. విశ్రాంత న్యాయమూర్తుల సారథ్యంలో జ్యుడీషియల్ కమిషన్లను ఏర్పాటు చేసి, అక్రమార్కులకు అరదండాలు వేయాల్సి ఉంది.

రాజ్యాంగాన్ని కుళ్లబొడిచిన జగన్, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలనూ పాడుచేశారు. ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామస్థాయి అధికారుల వరకూ చాలా మందిని పాదసేవకులుగా మార్చుకుని ప్రజాకంటక పాలన చేశారు. జగన్ మూలంగా సర్వభ్రష్టమైన వ్యవస్థలను కూటమి సర్కారు పూర్తిగా ప్రక్షాళించాలి. వైఎస్సార్సీపీ అంటకాగి ప్రజాప్రయోజనాలకు పాతరేసిన అధికారులను బోనెక్కించాలి. జగన్ సేవలో తరించిన పోలీసులు అందరినీ ఏరిపారేయాలి. వైఎస్సార్సీపీ నేతల అండదండలతో గడచిన అయిదేళ్లలో మానవ హక్కుల్ని కబళించిన వారందరినీ గుర్తించి కటకటాల్లోకి నెట్టాలి.

వైఎస్సార్సీపీ నాయకులు రోత బూతులతో సామాజిక మాధ్యమాలను మురుగుకాల్వలుగా మార్చేసి, న్యాయస్థానాలు, న్యాయమూర్తులపైనా విషంకక్కిన జగనాశుర మూకలపై ఉక్కుపాదం మోపాలి. జాతివనరులను దోచుకుతిని ఆర్థిక నేరాభియోగాలను నెత్తినమోస్తూ, పదేళ్లకుపైగా బెయిల్‌పై ఉంటున్న జగన్ విధ్వంసకాండకు యావత్ ఆంధ్రప్రదేశ్ బలైంది. అలాంటి రాజకీయ చీడపురుగులు దేశంలో మరెక్కడా మళ్లీ పదవుల్లోకి ప్రవేశించకుండా జనం బతుకులతో చెలగాటమాడకుండా నేరన్యాయ వ్యవస్థ క్రియాశీలం కావాలి.

కూటమి గెలుపుతో విదేశాలకు ఏపీ సీఐడీ చీఫ్​ సంజయ్ జంప్ - బిడ్డ జంకాడంటూ నెట్టింట ట్రోలింగ్‌ - AP CID Chief Sanjay On Leave

విధ్వంసం- విద్వేషం! ఇవే వైఎస్సార్సీపీ ఓటమికి ప్రధాన కారణాలు - Reasons For YSRCP Defeat In AP

ABOUT THE AUTHOR

...view details