తెలంగాణ

telangana

ETV Bharat / politics

రౌస్​ అవెన్యూ కోర్టు అనుమతి - ఈ నెల 14 వరకు సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత - MLC Kavitha CBI Custody

MLC Kavitha CBI Custody : దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు ఆమెను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు వాదనలు విన్న కోర్టు, ఈ నెల 14 వరకు కస్టడీకి అనుమతిచ్చింది. మరోవైపు అంతకుముందు సీబీఐ తనను ప్రశ్నించడం, అరెస్ట్​ చేయడాన్ని సవాల్​ చేస్తూ కవిత దాఖలు చేసిన 2 పిటిషన్లను​ కోర్టు తోసిపుచ్చింది.

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 11:44 AM IST

Updated : Apr 12, 2024, 4:32 PM IST

CBI Produced MLC Kavitha in Court in Delhi Liquor Case
CBI Produced MLC Kavitha in Court in Delhi Liquor Case

MLC Kavitha CBI Custody :దిల్లీ మద్యం కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీ నుంచి సీబీఐ ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటికే ఆమెను అరెస్టు చేసినట్లు ప్రకటించిన సీబీఐ, లోతుగా విచారించేందుకు 5 రోజులు కస్టడీ కోరుతూ గురువారం కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. అందులో భాగంగా కవిత (Kavitha Liquor Case)ను ఇవాళ దిల్లీ రౌస్​ అవెన్యూ కోర్టులో సీబీఐ హాజరుపరిచింది. అప్రూవర్ల వాంగ్మూలం ఆధారంగా కవితను ప్రశ్నించేందుకు 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది.

కోర్టులో సీబీఐ వాదనలు :కోర్టులో వాదనలు వినిపించిన సీబీఐ తరఫు న్యాయవాది మద్యం కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి అని తెలిపారు. విజయ్​ నాయర్​, తదితరులతో కలిసి పథకం రూపొందించారని అన్నారు. అందుకు దిల్లీ, హైదరాబాద్​లో సమావేశాలు జరిగాయని చెప్పారు. కవిత ఆడిటర్​ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఆమె పాత్ర స్పష్టంగా ఉందని చెప్పారు. రూ.100 కోట్లు సౌత్​ గ్రూప్​ నుంచి సమీకరించి ఆప్​ నేతలకు అందించారని వివరించారు. కవిత సూచనతో మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ.25 కోట్లు అందజేశారని ఈ విషయాన్ని శ్రీనివాసులురెడ్డి తన వాంగ్మూలంలో వెల్లడించారని స్పష్టం చేశారు.

కవిత అరెస్టులో నిబంధనల ఉల్లంఘన లేదు - కస్టడీ ఉత్తర్వుల్లో రౌజ్‌అవెన్యూ కోర్టు న్యాయమూర్తి

Delhi Liquor Scam Case Update :అందుకు వాట్సాప్​ చాట్ (Kavitha Whatsapp Chats)​ సంభాషణలు ఈ విషయాలు ధ్రువీకరించాయని సీబీఐ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. సంభాషణలను కోర్టుకు అందజేసినట్లు చెప్పారు. మద్యం కేసులో కవిత పీఏ అశోక్​ కౌశిక్​ వాంగ్మూలం ఇచ్చారని, అభిషేక్​ సూచనతో ఆప్​ నేతలకు డబ్బు ఇచ్చినట్లు అశోక్​ తెలిపాడని కోర్టుకు తెలియజేశారు. అలాగే కవితకు ఇండో స్పిరిట్స్​లో 33 శాతం వాటా ఉన్నట్లు బుచ్చిబాబు చెప్పారని కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ విషయాలన్నీ ఇప్పటికే ఛార్జిషీట్​లో సీబీఐ దాఖలు చేసింది. తగిన ఆధారాలు కూడా అందుకు జతపరిచినట్లు సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

మద్యం వ్యాపారులను సీఎం కేజ్రీవాల్​కు కలిపిందే కవిత : సౌత్​ గ్రూప్​నకు​ చెందిన ఒక వ్యాపారవేత్త సీఎం కేజ్రీవాల్​ను కలిశారని సీబీఐ కోర్టుకు తెలిపింది. దిల్లీలో మద్యం వ్యాపారానికి పూర్తిగా సహకరిస్తానని కేజ్రీవాల్​ ఆయనకు హామీ ఇచ్చారని వివరించింది. మద్యం వ్యాపారులను సీఎం కేజ్రీవాల్​కు కలిపిందే కవిత (MLC Kavitha Main Accused) అని సీబీఐ వాదనలు సాగించింది. మొత్తం కేసులో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి అయినందున ఆమె స్టేట్​మెంట్​ను రికార్డు చేయాల్సి ఉందని చెప్పింది. కోర్టు అనుమతితోనే కవితను అరెస్టు చేసినట్లు సీబీఐ స్పష్టం చేసింది.

శరత్​ చంద్రారెడ్డికి కేటాయించిన 5 జోన్లకు ప్రతిఫలంగా ఒక్కో జోన్​కు రూ.5 కోట్ల చొప్పున రూ.25 కోట్లు ఇవ్వాలని కవిత వారిని డిమాండ్​ చేశారని కోర్టుకు సీబీఐ వివరణ ఇచ్చింది. అంత మొత్తం ఇచ్చేందుకు శరత్​ చంద్రారెడ్డి విముఖత వ్యక్తం చేయడంతో హైదరాబాద్​లో తన వ్యాపారం సాగనివ్వనని శరత్​ చంద్రారెడ్డిని ఆమె బెదిరించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. కవిత విచారణకు సహకరించ లేదని, అందుకే కస్టడీకి అడుగుతున్నట్లు చెప్పింది. వాదనలు విన్న రౌస్​ అవెన్యూ కోర్టు, ఈ నెల 14 వరకు కస్టడీకి అనుమతి ఇచ్చింది. తిరిగి 15న ఉదయం 10 గంటలకు కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. కోర్టు నిర్ణయంతో అధికారులు కవితను సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు.

కవితకు చుక్కెదురు : ఇదిలా ఉండగా, అంతకుముందు రౌస్​ అవెన్యూ కోర్టులో కవితకు చుక్కెదురైంది. సీబీఐ ప్రశ్నించడం, అరెస్ట్​ చేయడాన్ని సవాల్​ చేస్తూ ఆమె తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది.

లిక్కర్ స్కామ్​తో నాకు సంబంధం లేదు - నాకెలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదు : కవిత

ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట - మధ్యంతర బెయిల్‌ నిరాకరించిన కోర్టు

Last Updated : Apr 12, 2024, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details