MLA Raja Singh Comments On Bjp : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ బీజేపీపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో తాను పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తూనే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక భరించలేకపోతున్నానని పార్టీకి తాను అవసరం లేదు, వెళ్లిపో అని చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన న్యూస్టుడేతో మాట్లాడారు.
బీజేపీలో వేధింపులు భరించలేకపోతున్నా : గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని తాను సూచించానని, అయితే తాను చెప్పిన పేర్లను పక్కనపెట్టి ఎంఐఎంతో తిరిగే వారికి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పార్టీలోని కీలక నేతకు ఫోన్ చేసి ఈ విషయంపై అడిగితే ఆ ఎన్నిక విషయం తనకు తెలియదని సమాధానమిచ్చారని తెలిపారు. ఆ సమాధానంతో తనపై దాగి ఉన్న కుట్ర కోణం బయటపడిందన్నారు. తాను ఇప్పటి వరకు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్లతోనే యుద్ధం చేస్తూ వచ్చానని, ఇప్పుడు సొంత పార్టీతోనూ యుద్ధం కొనసాగించాల్సిన పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరమని తెలిపారు.
అధ్యక్షుడిని మార్చాలని డిమాండ్ : జిల్లా అధ్యక్షుడి ఎన్నిక అనేది పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ సూచించిన వ్యక్తికి ఇవ్వడమనేది ప్రతి చోటా జరుగుతుంది. మరి ఇక్కడ తన సూచన ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో సంజాయిషీ ఇవ్వాలని ప్రశ్నించారు. వెంటనే అధ్యక్షుడిని మార్చాలని డిమాండ్ చేశారు. తన జీవితంలో ధర్మ ప్రచారం, ధర్మ యుద్ధం నేర్చుకున్నానని, ప్రస్తుతం పార్టీలో కొందరు అనుసరిస్తున్నట్లు బ్రోకరిజం నేర్చుకోలేదన్నారు. వారి వల్లే ఈ రోజు పార్టీ వెనుకబడిందని ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం వచ్చేదని, కానీ ఇలాంటి రిటైరైన వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికీ బీజేపీ ప్రభుత్వం రాదని వ్యాఖ్యానించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షులు : బీజేపీ ఇటీవలే 19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించగా, తాజాగా మరో నాలుగు జిల్లాలకు ప్రకటించింది. గోల్కొండ గోషామహల్ జిల్లా అధ్యక్షుడిగా ఉమా మహేంద్ర, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా సి.గోదావరి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ఊటుకూరు అశోక్ గౌడ్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వల్లభు వెంకటేశ్వర్లు పేర్లను కేటాయించింది. దీంతో గోల్కొండ జిల్లా అధ్యక్షుడిగా ఉమామహేంద్రను నియమించగా, రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధ్యక్షుడిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ - మిగతావి ఎప్పుడంటే?