తెలంగాణ

telangana

ETV Bharat / politics

'బీఆర్​ఎస్​ను అవినీతి పునాదులపై నిర్మించారు - అందుకే అధికారం కోల్పోగానే కుప్పకూలుతోంది' - Ponnam Prabhakar Fires on BRS - PONNAM PRABHAKAR FIRES ON BRS

Minister Ponnam Prabhakar on BRS : బీఆర్​ఎస్​ పార్టీపై మంత్రి పొన్నం ప్రభాకర్​ మరోసారి నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వం కూలుతుందన్న భారత రాష్ట్ర సమితిని అవినీతి పునాదులపై నిర్మించారని ధ్వజమెత్తారు. అనైతికంగా, అప్రజాస్వామికంగా నిర్మించింది ఏదీ నిలబడదని, అందుకే అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే 'కారు' ఖాళీ అవుతోందని ఎద్దేవా చేశారు.

Minister Ponnam
Minister Ponnam Prabhakar on BRS

By ETV Bharat Telangana Team

Published : Mar 25, 2024, 7:11 PM IST

'బీఆర్​ఎస్​ను అవినీతి పునాదులపై నిర్మించారు - అందుకే అధికారం కోల్పోగానే కుప్పకూలుతోంది'

Minister Ponnam Prabhakar on BRS : అబద్ధాలతో అప్రజాస్వామికంగా, అహంకారపూరితంగా మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన బీఆర్​ఎస్​, కాంగ్రెస్ అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే కూలిపోతోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రాన్ని దర్శించుకున్న మంత్రి పొన్నం, తిరుగు ప్రయాణంలో జహీరాబాద్​లో హస్తం పార్టీ ఎంపీ అభ్యర్థి సురేశ్​ షెట్కార్​తో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా అనైతికంగా, అప్రజాస్వామికంగా నిర్మించింది ఏదీ నిలబడదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని అంటున్న భారత రాష్ట్ర సమితిని చూస్తే ఆ విషయం అర్థం అవుతుందని అన్నారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కులమతాలను గౌరవిస్తూ, ప్రణాళిక బద్ధంగా పరిపాలన సాగిస్తోందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ, నిర్వీర్యమైన ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా సాగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 1000 కొత్త బస్సులు కొనుగోలు చేయడంతో పాటు మరో 2 వేల బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. 3 వేల పైచిలుకు ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే ప్రకటన వెలువరించామని గుర్తు చేశారు.

అవినీతి పునాదులపై బీఆర్​ఎస్​ పార్టీని నిర్మించారు. అందుకే అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే ఆ పార్టీ కుప్పకూలుతోంది. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. నిర్వీర్యమైన ఆర్టీసీకి మహాలక్ష్మి పథకంతో పూర్వ వైభవం తీసుకొచ్చాం. ఆర్టీసీలోకి త్వరలో మరిన్ని కొత్త బస్సులు అందుబాటులోకి తెస్తాం. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. - పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి

లోక్​సభ ఎన్నికల్లోనూ దీవించండి : 2013కు ముందున్న బాండ్లను విడుదల చేశామని, పీఆర్​సీ ప్రకటించామని మంత్రి చెప్పారు. ఆర్టీసీ కార్మికుల కృషితో అధికారంలోకి వచ్చిన పార్టీగా, వారికి పూర్తిగా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు హస్తం పార్టీ గెలిచేలా ప్రజలు దీవించాలని పొన్నం విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్​కు వచ్చిన మంత్రికి మాజీ మంత్రి చంద్రశేఖర్, ఫిలిం డెవలప్​మెంట్​ కార్పొరేషన్ ఛైర్మన్ గిరిధర్ రెడ్డి, పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details