Government Liquor Stores : దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని 2019 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ కొత్త విధానం పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచారు. బార్లు బార్లా తెరిచి నాసిరకం మద్యం ప్రవేశపెట్టి ధరల్ని అమాంతం పెంచేశారు. నాసిరకం మద్యం కారణంగా నిత్యం వందలాది మంది ఆస్పత్రుల పాలవుతున్నా ఆయా కుటుంబాలతో చెలగాటం ఆడారు. ఇవేమీ పట్టించుకోని జగన్.. ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. మద్యపాన నిషేధంపై మాత్రం నోరెత్తకుండా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారు. ప్రభుత్వం విక్రయించే కల్తీ మద్యం కారణంగా వేలాది మంది ఆసుపత్రి పాలవుతున్నా పట్టింపులేదు. మరోవైపు జిల్లాలో నేరాల రేటు అమాంతం పెరిగిపోయింది. మహిళలపై అఘాయిత్యాలు భరించలేని విధంగా ఎక్కువయ్యాయి. మందుబాబులను తాకట్టు పెట్టి వేలాది కోట్లు అప్పు చేసిన సీఎం ఈ భారమంతా జనంపై మోపారు.
ఏటా రూ.1,020 కోట్లు :ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు 200 ప్రభుత్వ దుకాణాల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. 2019కు ముందు రూ.80కు వచ్చే 180 ఎంఎల్ బ్రాందీ ఇప్పుడు రూ.160 చేశారు. అప్పట్లో క్వార్టర్ విస్కీ రూ.80కి దొరికేది కానీ ఇప్పుడు రూ.200కు పెంచి అమ్ముతున్నారు. గతంలో మ్యాన్సన్ హౌస్ క్వార్టర్ సీసా రూ.120 కాగా, రూ.240 చేశారు. కింగ్ఫిషర్ బీరు రూ.110 ఉండగా ఇప్పుడు రూ.220కి కూడా దొరకడం లేదు. రోజుకో రేటు పెట్టి మందుబాబుల జేబు గుల్ల చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కొత్తరకం అంటూ నాసిరకం బ్రాండ్లు తీసుకొచ్చి ప్రతిదానిపై రెట్టింపు ధరలు వసూలు చేసుకుంటున్నారు. నెలకు సగటున రూ.135 కోట్ల ఆదాయం చొప్పున ఏటా రూ.1,620 కోట్లు ప్రభుత్వానికి చేరుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలపై ఆదాయం ఏడాదికి రూ.600 కోట్లకు మించి ఉండేది కాదు. అంటే ఉమ్మడి జిల్లాలోని మందుబాబులపై ఏటా రూ.1,020 కోట్లు అదనపు భారం పడుతుండగా ఐదేళ్లలో 5,600 కోట్లు అదనంగా వసూలు చేశారు. కరోనా కాలం మినహాయించినా నాలుగేళ్లల్లో జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.4,080 కోట్లు అదనంగా వసూలు చేసింది.
వైసీపీ సమర్పించు 'జగనన్న బెల్టు షాపులు' - అధికారం అండతో యధేచ్చగా అమ్మకాలు
ప్రాణాలు తీస్తున్న వైనం :గతంలో వైన్షాపుల్లో దొరికే బ్రాండ్లు ఇపుడు జగన్ ప్రభుత్వం హయాంలో లభించడం లేదు. అధికార వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన డిస్టిలరీ కంపెనీ నుంచే ప్రభుత్వం మద్యం కొనుగోలు చేస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాసిరకం సరకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు తోడేస్తున్నారు. 'జె' బ్రాండ్ తాగి ఎంతోమంది ఆసుపత్రుల పాలవుతున్నారు. నాసిరకం తాగితే ఆకలి చచ్చిపోతుందని, విపరీతంగా చెమటలు పట్టి నిమిషాల్లోనే డీహైడ్రేషన్కు గురవుతున్నామని మందుబాబులు వాపోతున్నారు. నరాల బలహీనత, కాలేయం సంబంధిత వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారు పెరిగిపోతున్నారని వైద్యులు చెప్తున్నారు.
డిసెంబరు 31న ఏపీలో రూ. 156.60 కోట్ల మద్యం హాంఫట్! అబ్కారీ శాఖ ఖుషి ఖుషి