Harish Rao Viral fevers Cases in Telangana :సమైక్య పాలనలో కనిపించిన ఉదంతాలు నేడు కాంగ్రెస్ హయాంలో పునరావృతం అవుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు. సీజనల్ వ్యాధులతో జనం విలవిలలాడి పోతున్నారని, పల్లెల్లో వైద్యం పడకేసిందని వ్యాఖ్యానించారు. వ్యాధుల వ్యాప్తి తీవ్రంగా ఉన్నా చికిత్స అందించడానికి సరిపడా మందులు అందుబాటులో లేవని ఆరోపించారు. ఉమ్మడి పాలనలో చూసిన ఘటనలు కాంగ్రెస్ పాలన పుణ్యమా ఇప్పుడు ఏ పత్రిక చూసినా ఆ వార్తలే కనిపిస్తున్నాయని ట్వీట్ చేశారు.
పాలన గాడి తప్పి, పారిశుద్ధ్యం లేక రోగాలు : మలేరియా, డెంగీ, గున్యా వంటి విషజ్వరాలు రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తుంటే పాలకులకు చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. జ్వరాలతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందని అర్థమని ధ్వజమెత్తారు. పాలన గాడితప్పడం, పారిశుద్ధ్యం పడకేయడంతో పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక, డెంగీ కిట్స్ లేక రోగులు ప్రైవేటుకు వెళ్లి అప్పుల పాలవుతున్నారని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.