Harish Rao Fires On CM Revanth : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. 8 నెలల్లో 500 హత్యలు జరిగాయని ఆరోపించారు. తాను అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మర్నాడే హైదరాబాద్లో రెండు హత్యలు జరగడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఆందోళన వ్యక్తంచేశారు.
హోం మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై ఇంతవరకు పోలీసులతో సమీక్ష నిర్వహించలేదని 'ఎక్స్ వేదికగా హరీశ్ రావు పేర్కొన్నారు. హత్యలు, అత్యాచారాలు యథేచ్ఛగా జరుగుతున్నా ప్రభుత్వానికి, పోలీసులకు చీమ కుట్టినట్టయినా లేదని అసహనం వ్యక్తంచేశారు.
Harish Rao On Law and order :ప్రజల మానప్రాణాలను రక్షించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాల్లో లా అండ్ ఆర్డర్ లేకపోవడం బాధాకరమని హరీశ్రావు అన్నారు. శాంతి భద్రతల నిర్వహణలో సీఎం, పోలీసులు పూర్తిగా విఫలయ్యారని చెప్పడానికి రోజురోజుకూ పెరుగుతున్న నేరాలే నిదర్శనం అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర మేల్కొని వెంటనే శాంతిభద్రతలను పునరుద్ధరించాలని సూచించారు.
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది :గత పదేళ్లలో హైదరాబాద్ సహా తెలంగాణ నెలకొల్పిన శాంతి భద్రతల కారణంగా వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. సీఎం రాజకీయాలకు అతీతంగా స్పందించి, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఇలాంటి పరిస్థితులు చూస్తే రాష్ట్ర ప్రతిష్ఠతో పాటు హైదరాబాద్ పేరు కూడా దెబ్బతినే అవకాశం ఉందని, ఫలితంగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.