Congress Whip Adi Srinivas on BRS :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం కావడంతో బీఆర్ఎస్ ఓర్వలేక దుష్ప్రచారం చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న సీఎంపై బీఆర్ఎస్ సామాజిక మీడియా బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశారన్న ఆది శ్రీనివాస్, పెట్టుబడుల స్వర్గదామంగా రాష్ట్రాన్ని మార్చుతున్నారన్నారు. గత పదేండ్ల కాలంలో సూటు బూటు వేసుకుని దావోస్ వెళ్లిన కేటీఆర్ రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారని, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ ఒప్పందం చేసుకున్న కంపెనీలకు గత ప్రభుత్వం సరైన వసతులు కల్పించకపోవడంతోనే ఇతర రాష్ట్రాలకు వెళ్లాయని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. సోమవారం గాంధీభవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి విజయాన్ని తక్కువ చేసి చూపించేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కష్టపడుతోందని విమర్శించారు. బుర్ర లేని వాళ్లు కొందరు కేటీఆర్ రాసిచ్చిన స్క్రిప్టు చదువుతున్నారని ధ్వజమెత్తారు. అంగుళం భూమి కూడా కేటాయించక ముందే మనీలాండరింగ్ జరిగిందని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని ఆరోపించారు.
సూటు బూటు వేసుకుని హడావిడి : తప్పులు చేసి తీహార్ జైల్లో ఎవరున్నారో ప్రజలకు బాగా తెలుసని ఎమ్మెల్సీ కవితను ఉదేశిస్తూ ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు. పదేళ్లలో సూటు బూటు వేసుకుని కేటీఆర్ చేసిన హడావిడికి, రేవంత్ రెడ్డి కేవలం 8 నెలల్లోనే సమాధానం చెప్పారన్నారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు, మరోవైపు ప్రైవేట్ ఉద్యోగాల కల్పన చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.