తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2024, 10:07 PM IST

ETV Bharat / politics

గ్రేటర్​పై కాంగ్రెస్ గురి - అధిక పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా చేరికలకు ఆహ్వానం

Congress Focus on Parliament Seats in GHMC : రాష్ట్ర రాజధానిలో అధికార పార్టీ తన బలం పెంచుకునేందుకు బల్దియాపై గురి పెట్టింది. లోక్​సభ ఎన్నికల్లోపు బీఆర్ఎస్, బీజేపీ నుంచి వీలైనంత మంది కార్పొరేటర్లను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధమైంది. ఇటీవలే జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్​ దంపతులతోపాటు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియూద్దీన్ హస్తం గూటికి చేరగా, తాజాగా డిప్యూటీ మేయర్ శ్రీలత దంపతులు కూడా కారును వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ వారం పదిరోజుల్లో మరో పాతిక మంది కార్పొరేటర్లు కాంగ్రెస్​లో చేరుతారని నేతలు భావిస్తున్నారు. మరోవైపు తమ కార్పొరేటర్లను చేజార్చుకోకుండా బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

Congress Focus on Parliament Seats in GHMC
BRS Leaders Joined Congress Party

Congress Focus on Parliament Seats in GHMC : గ్రేటర్ హైదరాబాద్​లో అధికార, విపక్ష పార్టీల లెక్కలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాజధానిలో ఊహించని ఫలితాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​పై గట్టిగానే గురిపెట్టింది. ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయిలో మంతనాలు సాగిస్తూ, బీఆర్ఎస్​ను బలహీనపర్చేందుకు పావులు కదుపుతోంది.

GHMC Election Results : 2020లో గ్రేటర్​లోని 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్- 55, ఎంఐఎం-44, బీజేపీ- 48 డివిజన్లలో గెలుపొందాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఏఎస్ రావు నగర్, ఉప్పల్, లింగోజిగూడలో మాత్రమే గెలిచింది. అందులో ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ గులాబీ పార్టీలోకి(BRS Party) వెళ్లడంతో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య రెండుకు పడిపోయింది. 56 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవానికి అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.

కాంగ్రెస్‌లోకి చేరికల ప్రవాహం - ఆ 7 స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం 'ఆకర్ష్' వ్యూహం!

బల్దియాపై పూర్తి పట్టు కోల్పోయిన కాంగ్రెస్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆశించిన విజయాన్ని దక్కించుకోలేకపోయింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 29 స్థానాలకు మూడింట మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్​లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల టికెట్లు ఆశించి భంగపడ్డారు. దాంతో కాంగ్రెస్​లో చేరి టికెట్ దక్కించుకున్నా గెలవలేకపోయారు.

EX Deputy Mayor Baba Fasiuddin Join In Congress :ఈ పరిణామాలతో, లోక్​సభ ఎన్నికల్లోపు గ్రేటర్​లో పార్టీని బలోపేతం చేసుకోకపోతే 4 ఎంపీ స్థానాలపై ప్రభావం పడుతుందని కాంగ్రెస్ సీనియర్లు అంచనా వేశారు. అందుకే ముందస్తుగా బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ తలుపులు తెరిచారు. అసెంబ్లీ ఎన్నికలకు(Assembly Elections) ముందు ఖైరతాబాద్, మాదాపూర్, హఫీజ్ పేట, రహ్మత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ల చేరికతో బల్దియాలో కాంగ్రెస్​కు ఆరు సీట్లు పెరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వివిధ స్థాయిల్లో ఉన్న అగ్ర నేతల సంప్రదింపులు, బీఆర్ఎస్ అధిష్ఠానంపై అసంతృప్తితో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్​తోపాటు ఆయన సతీమణి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవి హస్తం గూటికి చేరారు.

అలాగే బోరబండ బీఆర్ఎస్ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పది రోజుల వ్యవధిలోనే జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్, తార్నక కార్పొరేటర్ మోతె శ్రీలతతోపాటు బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు శోభన్ రెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరారు. దీంతో గ్రేటర్​లో బీఆర్ఎస్ తేనెతుట్టె మరోసారి కదిలినట్లు అయింది. ఆరుగురు కార్పొరేటర్లు కాస్తా ఇప్పుడు తొమ్మిది మంది అయ్యారు.

లోక్​సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్​లో చేరికల జోరు - ఆ వ్యూహంలో భాగమేనా!

GHMC Deputy Mayor Joined Congress :తెలంగాణ ఉద్యమంలో ఉండి పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు తగిన గుర్తింపు లేకపోవడం వల్లే తన భర్తతో కలిసి పార్టీ మారుతున్నట్లు డిప్యూటీ మేయర్ శ్రీలత తెలిపారు. బీఆర్ఎస్​లో అవమానాలు ఎదుర్కొంటూ ఇబ్బందులకు గురవుతున్న నాయకులు స్వేచ్ఛగా తమ పార్టీలో చేరవచ్చని హైదరాబాద్ జిల్లా ఇన్​ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆఫర్ ప్రకటించారు.

గ్రేటర్​లోని బీఆర్ఎస్, బీజేపీ నుంచి మరికొంత మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరితే తామంతా అదే పార్టీలోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. సమీప భవిష్యత్​లో జీహెచ్ఎం​సీలోని కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారితే, బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున కార్పొరేటర్లు కాంగ్రెస్​లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

BRS Leaders Joined Congress Party : అంతేకాకుండా ఇటీవల చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్​, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తోనూ కొంత మంది కార్పొరేటర్లు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వారి చేరికల బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొంతు రాంమ్మోహన్​కు (Bonthu Rammohan) అప్పగించినట్లు బల్దియాలో జోరుగా చర్చించుకుంటున్నారు. ఇటీవల మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా సీఎంను కలవడంపై పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారాన్ని మేయర్ ఖండిస్తూ తాను బీఆర్ఎస్​లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అలాగే పలు డివిజన్లలో జనంపై పట్టుకున్న బీఆర్ఎస్ నేతలపై కూడా కాంగ్రెస్ కన్నేసింది.

Parliament Elections 2024 :అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో అత్యధిక స్థానాలు గెలుచుకొని గ్రేటర్​లో పరువు నిలబెట్టుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు చేజారకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నగర కార్పొరేటర్లతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలంగాణ భవన్​లో సమావేశమై దిశానిర్దేశం చేశారు. అయినా కూడా కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో రాజధానిలో బీఆర్ఎస్ బలం తగ్గుముఖం పడుతోంది.

56 మంది కార్పొరేటర్లకుగాను 47 మంది కార్పొరేటర్లు మిగిలారు. వారిలో కనీసం పాతిక మందిని తమవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ వ్యూహం రచించింది. ఈ నెల 27న చేవెళ్లలో జరిగే సభలో కనీసం 10 మంది కార్పొరేటర్లు ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో తమ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ఖమ్మం కాంగ్రెస్​లో జోరందుకున్న చేరికలు - హస్తం తీర్థం పుచ్చుకున్న నలుగురు బీఆర్​ఎస్​ కార్పొరేటర్లు

కాంగ్రెస్​ పార్టీకి తలనొప్పిగా మారిన ఇంఛార్జ్​లు - ముడుపులు తీసుకొని పదవులు ఇస్తున్నారనే ఆరోపణ

ABOUT THE AUTHOR

...view details