CM Revanth Reddy Comments on KCR :తెలంగాణ రాష్ట్ర సాధనలో పట్టభద్రులది కీలక పాత్రని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన పట్టభద్రుల కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.
వాళ్లే కేసులు వేశారు :కేసీఆర్ అవసరం తెలంగాణకు లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని, రాష్ట్రంతో పేగుబంధం తెంచుకుని పార్టీ పేరు కూడా మార్చుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. చేసింది చాలు ఇక ఫామ్హౌస్లో విశ్రాంతి తీసుకోవాలని ప్రజలు ఆయనకు చెప్పారని ఎద్దేవా చేశారు. ప్రజలు తిరస్కరించినా కేసీఆర్లో మార్పు రాలేదని, ఫామ్ హౌస్లో కూర్చుని రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పది సంవత్సరాల పాటు ఏమీ చేయని బీఆర్ఎస్ నేతలు, ఇవాళ తమని తప్పుపడుతున్నారని, ఏడాదిలోనే తాము ఏమీ చేయలేదని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
పది సంవత్సరాల పాటు నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చిన వాటి మీద వాళ్లే కేసులు వేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం ఏడాదిలోనే 55,163 మందికి జాబ్స్ ఇచ్చిందని, 11,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం పది సంవత్సరాల పాటు టీచర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పించలేదని వెల్లడించారు. తమ ప్రభుత్వం రాగానే వాటిని పూర్తి చేశామని పేర్కొన్నారు.
క్రీడల్లో యువత రాణించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ :చదువుతున్న యువతలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని, టాటా సంస్థతో కలిసి 65 ఐటీఐలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చామని వివరించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, క్రీడల్లో యువత రాణించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, నిజామాబాద్కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్కు గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చి రూ.2కోట్ల ప్రోత్సాహక నగదు అందజేశామని, క్రికెటర్ సిరాజ్కు ఎన్నో మినహాయింపులతో గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చామని గుర్తు చేశారు. పారా అథ్లెట్, వరంగల్ బిడ్డ జివాంజీ దీప్తికి రూ.25లక్షలు, ఇంటి స్థలం ఇచ్చామని అన్నారు.