Prathidwani :తన శతృవులు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వెతికి వేటాడే అమెరికా ఇప్పుడు బిగ్షాక్కు గురైంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్పై జరిగిన హత్యా ప్రయత్నంతో ఉలిక్కిపడింది. 1981లో రోనాల్డ్ రీగన్పై హత్యాయత్నం తర్వాత అమెరికా అధ్యక్షుడు కానీ అధ్యక్ష అభ్యర్థిని గానీ లక్ష్యంగా చేసుకున్న సందర్భమేదీ లేదు. ఈ ఎటాక్తో అమెరికా సీక్రెట్ సర్వీస్లో లోపాలు బట్టబయలు అయ్యాయి. మాజీ అధ్యక్షుల భద్రతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అంతేనా?? గన్ కల్చర్పై కూడా మరోసారి చర్చ మొదలైంది.
మాస్ షూటింగ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారిపోయిన అగ్రరాజ్యం ఈ విష సంస్కృతి నుంచి బయటపడలేకపోతోందా? ఆ దేశ రాజకీయాలపై ఈ సంఘటన ప్రభావం ఎలా ఉండబోతోంది? అదే నేటి ప్రతిధ్వని అంశం. దీని గురించి ఈ రోజు లైవ్లో డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు సియాచిన్ గ్లేసియర్ వద్ద విధులు నిర్వహించిన సైనికాధికారి, కౌంటర్ టెర్రరిజం- అక్రమ చొరబాట్ల కట్టడిలో నిపుణులు. జమ్ము-కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పని చేసిన కల్నల్ వి.వి.రావు. మరొకరు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వ్యాసకర్త చలసాని నరేంద్ర.
ట్రంప్పై హత్యాయత్నం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓవల్ ఆఫీసు నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. 24 గంటల వ్యవధిలో మూడుసార్లు ఆయన ఇలా మాట్లాడారు. హింస దేనికీ సమాధానం కాదని, ఈ తరహా ఘటనలు పునరావృతం కావడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని చెప్పారు. రాజకీయ వేడి రాజుకోవడం సహజమని, అది శ్రుతి మించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు. కాల్పుల ఘటనపై వేగంగా, సమగ్ర దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు.