Key Candidates in 4th Phase Elections : సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోసారి గెలిచి తమ సత్తాను చాటేందుకు కేంద్ర మంత్రులు ప్రయత్నిస్తుండగా, ఆన్స్క్రీన్తో పాటు ఆఫ్స్ర్కీన్లోనూ తమకు పట్టు ఉందని నిరూపించుకోవాలని సినీప్రముఖులు తహతహలాడుతున్నారు. నాలుగో విడతలో ప్రముఖులు పోటీ చేస్తున్న కీలక నియోజకవర్గాలేంటో చూద్దాం.
బిహార్ మినీ మాస్కోలో పోరు రసవత్తరం
బిహార్లో అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటైన బెగూసరాయ్ నుంచి కేంద్రమంత్రి గిరిరాజ్సింగ్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తరఫున ఈసారి ఆయనే బరిలో ఉన్నారు. బెగూసరాయ్ని బిహార్ మినీ మాస్కోగా పిలుస్తారు. ఇక్కడ భూమిహార్ వర్గం ప్రజల ప్రాబల్యం ఎక్కువ. గిరిరాజ్ సహా ఈ స్థానంలో ఇప్పటిదాకా గెలిచిన ఎంపీల్లో అత్యధికులు ఆ వర్గంవారే. 2019 ఎన్నికల్లో ఇక్కడ సీపీఐ అభ్యర్థిగా బరిలో దిగిన కన్నయ్య కుమార్ను గిరిరాజ్ 4.2 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. ప్రస్తుతం గిరిరాజ్కు సీపీఐ తరఫున పోటీ చేస్తున్న అవధేశ్కుమార్ రాయ్ ప్రధాన ప్రత్యర్థి. 86 శాతం హిందూ జనాభా ఉన్న బెగూసరాయ్ ఎన్డీఏ గట్టి పట్టున్న స్థానం. కాబట్టి తన విజయంపై గిరిరాజ్ ధీమాగా ఉన్నారు. వాస్తవానికి గిరిరాజ్ పొరుగున ఉన్న లఖీసరాయ్ నియోజకవర్గానికి చెందినవారు. తనకు ఇష్టం లేకపోయినప్పటికీ పార్టీ ఆదేశాల మేరకు 2019లో ఇక్కడ బరిలో దిగారు. గెలిచాక నియోజకవర్గాన్ని అంతగా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీనికితోడు స్వపక్షంలో అసమ్మతి సెగలు ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఐక్యంగా ఉండటం వల్ల ఇక్కడ బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశం దాదాపుగా లేదు.
అధీర్రంజన్ పోటీగా మాజీ క్రికెటర్
బంగాల్లోని బహరంపుర్ నియోజకవర్గంలో పోరు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక్కడ వరుసగా అయిదుసార్లు గెలుపొందిన కాంగ్రెస్ సీనియర్ నేత, సిటింగ్ ఎంపీ అధీర్రంజన్ చౌధరీ మరోసారి పోటీలో ఉన్నారు. ఆయనపై భారత జట్టు మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ను తృణమూల్ కాంగ్రెస్ బరిలో దింపింది. ఈ లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉండగా, వాటిలో ఆరు తృణమూల్ ఖాతాలోనివే. మరొకటి బీజేపీ సిటింగ్ స్థానం. ఈ నియోజకవర్గంలో ముస్లింలు 50% వరకూ ఉన్నారు. వారి అండతో ఈసారి పఠాన్ కచ్చితంగా విజయం సాధిస్తారని తృణమూల్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. పఠాన్ స్థానికేతరుడని ప్రచారంలో కాంగ్రెస్ పదేపదే పేర్కొంటోంది. బీజేపీ ఇక్కడ నిర్మల్కుమార్ సాహాకు టికెట్ కేటాయించింది.
ఖూంటీ బరిలో అర్జున్ ముండా
ఝార్ఖండ్లోని ఖూంటీ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అర్జున్ ముండా బీజేపీ అభ్యర్థిగా మరోసారి అక్కడే పోటీకి దిగారు. మూడుసార్లు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్వరాష్ట్రంలోనే కాకుండా బిహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్లలోనూ గిరిజన దిగ్గజ నేతల్లో ఒకరిగా ఈయనకు పేరుంది. 2019లో కాంగ్రెస్ అభ్యర్థి కాళీచరణ్ ముండాపై 1,445 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ప్రస్తుతం హస్తం పార్టీ మళ్లీ కాళీచరణ్కే టికెట్ కేటాయించింది. దీంతో మరోసారి హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఖూంటీ ఎస్టీ రిజర్వుడు సీటు. 1984 తర్వాత బీజేపీ ఇక్కడ ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది.