Legal Advice on Family Problem :ఒక జంటకు పెళ్లి అయ్యి రెండేళ్లు. అయితే, అమ్మాయి అమ్మనాన్నలకు మగ సంతానం లేరు. ఇద్దరూ ఆడపిల్లలే. కాబట్టి, పెళ్లిచూపుల్లోనే పేరెంట్స్ని చూసుకోవాల్సిన బాధ్యత తనదేనని భర్త, అత్తమామలకు చెప్పింది. అప్పుడు వారు అందుకు ఒప్పుకొన్నారు. కానీ, ఆ సమయంలో ఇందుకోసం అగ్రిమెంట్లు ఏమీ రాసుకోలేదు. కొన్ని రోజులు అంతా సాఫీగానే సాగింది. కానీ, ప్రస్తుతం మాత్రం తన జీతం, ఖర్చులు అన్నింటి మీద ఆంక్షలు పెడుతున్నారు.
పుట్టింటి వారికి ఏ విధంగానూ సాయం చేయనివ్వడం లేదు. పైగా తన వాళ్లను(అమ్మాయి పేరెంట్స్) తన మీద ఆధారపడి బతుకుతున్నారంటూ అందరిలోనూ హేళన చేస్తున్నారు. "ఇది తనకు నచ్చడం లేదని.. ఆడపిల్లలకు అమ్మనాన్నలనుచూసుకునే బాధ్యత లేదా? అని న్యాయ నిపుణులు సలహా కోరుతున్నారు ఓ సోదరి. మరి, ఈ సమస్యకు ప్రముఖ న్యాయవాది జి. వరలక్ష్మి ఎలాంటి ఆన్సర్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం.
దంపతుల మధ్య తగాదాలకూ ఇవే కారణం!
వివాహిత సొంతంగా సంపాదించిన ఆస్తి ఆమెకు మాత్రమే చెందుతుంది. అయితే, మన హిందూ సంప్రదాయంలో భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నప్పుడు ఇంటి పోషణ భారం అవ్వకుండా ఇద్దరూ కలిసి చూసుకోవాలనే ఒప్పందంతో నడుచుకుంటున్నారు. ఒకరి సంపాదన సరిపోనప్పుడు రెండో వారి ఆదాయం మీద ఆధారపడుతున్నారు. అదంతా భవిష్యత్తు భద్రత కోసం జరుగుతోంది. అయితే, ప్రస్తుతం కుటుంబ అవసరాల్లో ఏసీలు, ఫ్రిజ్.. అన్ని భాగమయ్యాయి. అవి తలకు మించిన భారమై ఇద్దరి సంపాదన కూడా సరిపోని పరిస్థితుల్ని నెలకొంటున్నాయి. ఇవే దంపతుల మధ్య తగాదాలకూ కారణం అవుతున్నాయని చెబుతున్నారు న్యాయ నిపుణురాలు జి. వరలక్ష్మి.
"వయసు మళ్లిన తల్లిదండ్రుల పోషణ బాధ్యత వారి సంతతిదేనని.. హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్లోని సెక్షన్ 25 చెబుతుంది. ఇందులో కొడుకు, కూతురు అనే భేదం లేదు. భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని సెక్షన్144 ప్రకారం కుమారుడు లేని పక్షంలో.. కుమార్తె సంపాదనపరురాలైతే ఆమె దగ్గర నుంచి కూడా మెయింటెనెన్స్ పొందవచ్చు. అలాగే, ఒకవేళ బిడ్డలు మరణిస్తే.. వారి సంతానం(మనవలు, మనవరాళ్లు), కోడలి నుంచి కూడా మెయింటెనెన్స్ కోరవచ్చు."- జి. వరలక్ష్మి, న్యాయవాది