Tips to Protect Aadhaar Card from Cyber Attacks:దేశంలో ప్రతి భారతీయుడికీ అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుగా ఆధార్ మారిపోయింది. ప్రభుత్వ రాయితీలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఏ సంక్షేమ పథకం ప్రయోజనాలు పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఆధార్ విషయంలో చాలా మంది ప్రజలు నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఆధార్ కార్డును ఎక్కడ పడితే అక్కడ వాడుతూ, జిరాక్స్ ఎవరికి పడితే వారికి ఇస్తుంటారు. మరి మీరు కూడా ఇలానే చేస్తుంటారా? అయితే అలర్ట్ కావాల్సిందే అని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆధార్ కార్డ్ను ఎక్కడ పడితే అక్కడ వాడుతూ, జిరాక్స్ కాపీలను ఎవరికి పడితే వారికి ఇస్తే అవి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కడమే కాకుండా ఆధార్, ఫోన్ నంబర్ల ఆధారంగా ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల విజయవాడకు చెందిన ఓ వ్యాపారికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించారు. ఆయన ఆధార్ నంబరుతో సహా చెప్పి ఫ్లాట్ రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ రైటర్ దగ్గర, ట్రస్టుకు విరాళం ఇచ్చినప్పుడు, ఇంటి పన్ను మార్చేందుకు, ప్లాటు అమ్మే సందర్భాల్లో ఆధార్ ఇచ్చారని వరసపెట్టి చెబుతుంటే ఆయన నోరెళ్లబెట్టారు. అసలు ఈ వివరాలను నేరగాళ్లు ఎక్కడి నుంచి సేకరించారనేది ఆయనకు అంతుపట్టలేదు.
‘ఇ-ఆధార్’తో ఇబ్బందులు తప్పవా?:చాలా మంది డిజిటల్ సంతకంతో వచ్చే ఇ-ఆధార్ను గుర్తింపు కార్డుగా వినియోగిస్తుంటారు. దానిపై ఫోన్ నంబర్ ఉంటోంది. ఇది సైబర్ నేరగాళ్లకు చిక్కితే వాటి ద్వారా బ్యాంకు ఖాతాలు సేకరించి, నిధులు కొట్టేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ఫోన్ నంబరుతో కొత్త సిమ్ కార్డు సృష్టించి, అసలు సిమ్కు బ్యాంక్ ఓటీపీలు రాకుండా తాత్కాలికంగా బ్లాక్ చేస్తారని, వారు సృష్టించిన సిమ్కు ఓటీపీలు వచ్చేలా చేసుకుంటారని అంటున్నారు. పని పూర్తయిన తర్వాత అన్ బ్లాక్ చేసి, అసలు సిమ్కార్డును పునరుద్ధరిస్తారని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల బ్యాంకు ఖాతాలో డబ్బులు పోయిన సంగతే బాధితులకు తెలియదని అంటున్నారు.