Vietnam Storm Death Toll : యాగి తుపాను వియత్నాంలో పెను విధ్వంసాన్ని సృష్టించింది. వియత్నాం ఉత్తర ప్రాంతంలో భారీ వర్షాల ధాటికి ఆకస్మిక వరదలు సంభవించి పర్వత ప్రాంతంలో ఉన్న ఓ గ్రామం మొత్తాన్ని ఊడ్చేశాయి. ఈ తుపాను కారణంగా మరణాల సంఖ్య 141కి చేరింది. వందలాది మందికి గాయాలయ్యాయి. ఇంకా 69 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉంది. కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగానే ఎక్కువగా మరణాలు సంభవించాయి.
వియత్నాంలో యాగి తుపాను విధ్వంసం - 141 మంది మృతి - Vietnam Typhoon Yagi
Published : Sep 11, 2024, 11:13 AM IST
Vietnam Storm Death Toll : వియత్నాంలో యాగి తుపాను విలయాన్ని సృష్టించింది. పర్వత ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు ఒక గ్రామం మొత్తాన్ని ఊడ్చేశాయి. యాగి తుపాను కారణంగా వియత్నాంలో మృతుల సంఖ్య 141కి చేరింది. వందలాది మంది గాయపడ్డారు. ఇంకా అనేక మంది జాడ తెలియాల్సి ఉంది.
యాగి తుపాను కారణంగా లాంగ్ నౌ అనే గ్రామం మొత్తం ధ్వంసమైంది. ఆ గ్రామంలో నివాసం ఉంటున్న 35 కుటుంబాలు మట్టి చరియలు, శిథిలాల కింద చిక్కుకుపోయాయి. ఇప్పటి వరకు 16 మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికి తీయగా, 40 మంది గల్లంతయ్యారు. 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇక ఉత్తర వియత్నాంలోని ఫుథో ప్రావిన్స్లో రెడ్ నదిపై నిర్మించిన ఉక్కు వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 10 కార్లు, ట్రక్కులు, రెండు బైక్లు నీళ్లలో పడిపోయాయి.
ఇదే అతిపెద్ద తుపాను
ఈ తుపాను శనివారం వియత్నాం తీరం దాటగా, ఆ సమయంలో అక్కడి ఉత్తర తీర ప్రాంతాలు వణికిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల 30లక్షల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఈ ప్రాంతాన్ని తాకిన అత్యంత శక్తిమంతమైన టైఫూన్లలో ఒకటిగా యాగి తుపాన్ వియత్నాం అని అధికారులు అభివర్ణించారు. గంటకు 149 కిలోమీటర్ల వేగంతో గాలులు వీశాయి. నదులన్నీ ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రాజధాని హనోయి గుండా ప్రవహించే రెడ్ రివర్తో సహా పలు నదుల్లో నీటి మట్టాలు ప్రమాదకరంగా ఉండడం వల్ల అధికారులు సమీపంలో నివసించే ప్రజలను ఖాళీ చేయించారు. వియత్నాంలో జనాభాపరంగా రెండో అతిపెద్ద నగరమైన హనోయ్లో 2008 తర్వాత భారీ స్థాయిలో వరదలు సంభవించాయి. హనోయ్లో నివసించే 85 లక్షల మందిపై ఇవి ప్రభావం చూపాయి.