తెలంగాణ

telangana

'గాజా స్కూల్​పై ఇజ్రాయెల్ ఎటాక్ ఏమాత్రం కరెక్ట్ కాదు' - UN On Israel Air Strike

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 3:27 PM IST

UN On Israel Air Strike : గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఇజ్రాయెల్ దాడిలో సామాన్యులతో పాటు తమ ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆందోళన వ్యక్తం చేసింది. 12 వేల మంది ఆశ్రయం పొందుతున్న చోట ఇజ్రాయెల్ దాడులు చేసిందని, అంతర్జాతీయ మానవతాచట్టం ఉల్లంఘనలను ఆ దేశం ఆపాలని ఐక్యరాజ్య సమితి సూచించింది.

UN On Israel Air Strike
UN On Israel Air Strike (Associated Press)

UN On Israel Air Strike :ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం సామాన్య ప్రజలతో పాటు వారికి సేవలందిస్తున్న సిబ్బంది ప్రాణాల మీదకు తెస్తోంది. గాజా పట్టీలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో 34 మంది మరణించినట్టు పాలస్తీనా ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మృతుల్లో తమ సిబ్బంది కూడా ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని UN చీఫ్ ఆంటోనియో గుటెరస్ ధ్రువీకరించారు.

గాజాలోని ఓ పాఠశాలలో 12వేల మంది ఆశ్రయం పొందుతున్న చోట ఇజ్రాయెల్ తాజాగా దాడి చేసిందని చెప్పారు. ఈ దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్న గుటెరస్‌, అంతర్జాతీయ మానవతాచట్టం ఉల్లంఘనలను ఇజ్రాయెల్‌ వెంటనే ఆపాలన్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో యూఎన్ పాలస్తీనియన్ రిఫ్యూజీ ఏజెన్సీ- U.N.R.W.Aకి చెందిన ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎవరినీ వదిలిపెట్టడం లేదు!
ఇజ్రాయెల్ వైమానిక దాడిపై U.N.R.W.A ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేసింది. నుసీరత్‌లోని పలు ప్రాంతాలతో పాటు ఓ పాఠశాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసిందని పేర్కొంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైన నాటి నుంచి ఈ స్థాయిలో ఒకే దాడిలో తమ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం తొలిసారని తెలిపింది. మృతుల కుటుంబాలకు U.N.R.W.A ప్రగాఢ సానుభూతిని తెలిపింది. యుద్ధం మొదలైన దగ్గరి నుంచి ఆ పాఠశాలపై ఇప్పటికి ఐదుసార్లు దాడి జరిగిందని, అక్కడ మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారని వివరించింది. గాజాలో ఎవరూ సురక్షితంగా లేరన్న U.N.R.W.A ఎవరినీ వదిలిపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పాఠశాలలు, పౌరులకు సంబంధించిన మౌలిక సదుపాయాలపై దాడులు జరగకూడదని, ఘర్షణపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని అభ్యర్థించింది.

మరోవైపు గత ఏడాది అక్టోబర్‌ నుంచి గాజా పట్టీలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటి వరకు 41 వేల 84 మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందారని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. ఇజ్రాయెల్ -హమాస్ యుద్ధం కారణంగా 95 వేల మంది గాయపడినట్టు వెల్లడించింది. గాజాలోని ఆరు పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజల్ని గత నెల నుంచి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది. ఇప్పటి వరకు ఆ పాఠశాలపై జరిగిన దాడుల్లో 170 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. అయితే పాఠశాలల్లో ఉన్న హమాస్ కమాండ్ సెంటర్‌ను మాత్రమే తాము లక్ష్యంగా చేసుకున్నట్టు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. పాఠశాల నుంచి హమాస్‌ మిలిటెంట్లు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, అందుకే దాడి చేశామని పేర్కొంది.

అమెజాన్‌ ప్రాంతంలో తీవ్రమైన కరవు- బిక్కుబిక్కుమంటూ ప్రజల జీవనం! - Drought Impact In Brazil

వియత్నాంలో యాగి తుపాను విధ్వంసం - 141 మంది మృతి - Vietnam Typhoon Yagi

ABOUT THE AUTHOR

...view details