Global South Summit 2024 :ఆహార, ఇంధన భద్రత సంక్షోభాలు, ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కోవడంలో ఐక్యంగా పనిచేయాలని గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ వర్చువల్గా నిర్వహించిన వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ మూడో ఎడిషన్లో ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు.
గ్లోబల్ సౌత్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్-DIPని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సోషల్ ఇంపాక్ట్ ఫండ్కు భారత్ 25 మిలియన్ డాలర్లు తొలి విరాళం అందించనున్నట్లు మోదీ చెప్పారు. పరస్పర వాణిజ్యం, సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి భారత్ నిబద్ధతను ప్రధాని పునరుద్ఘాటించారు.
గ్లోబల్ సౌత్ దేశాలతో తన సామర్థ్యాలను పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం ఉందనీ, కొవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి ప్రపంచం ఇంకా పూర్తిగా బయటపడలేదని చెప్పారు. యుద్ధాల కారణంగా అభివృద్ధికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తున్నాయని, సాంకేతిక విభజన వంటి కొత్త ఆర్థిక, సామాజిక సవాళ్లు ఉద్భవించాయని చెప్పారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి గ్లోబల్ సౌత్ దేశాలు ఏకం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
'నిష్పాక్షికమైన ఎన్నికలను నిర్వహించే వాతావరణాన్ని సృష్టిస్తాం'
బంగ్లాదేశ్లో స్వేచ్ఛాయుత, నిష్పాక్షికమైన ఎన్నికలను నిర్వహించే వాతావరణాన్ని సృష్టిస్తామని అంతర్జాతీయ సమాజానికి ఆపద్ధర్మ ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ యూనస్ ఖాన్ హామీఇచ్చారు. సమ్మిళిత బహుతత్వ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు తాము కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.