తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం - చైనా అధ్యక్షుడితో భేటీపై ఉత్కంఠ

బ్రిక్స్‌ సమ్మిట్‌ కోసం రష్యా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ - కజాన్​ విమానాశ్రయంలో ఘన స్వాగతం

PM Modi BRICS Summit
PM Modi BRICS Summit (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

PM Modi BRICS Summit :బ్రిక్స్ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యాలోని కజాన్​ చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత తాను బస చేస్తున్న హోటల్‌కు చేరుకున్న ప్రధానికి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అక్కడే వారితో కొద్ది సేపు సంభాషించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రిక్స్ కూటమి నేతలతో ప్రధాని మోదీ పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

మరోవైపు ఈ సమావేశంలోనే ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ మధ్య ద్వైపాక్షిక భేటీ కూడా ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరుదేశాలు కీలక గస్తీ ఒప్పందాన్ని చైనా మంగళవారం ధ్రువీకరించింది. ఈ విషయంపై ఇరుపక్షాలు చేసుకున్న తీర్మానాన్ని అమలు చేసేందుకు భారత్​తో కలిసి చైనా పని చేస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి లిన్​ జియాన్ పేర్కొన్నారు.

వివిధ అంశాలపై విస్తృత చర్చలు
అంతర్జాతీయ అభివృద్ధి ఎజెండాకు సంబంధించిన అంశాలపై చర్చలకు ముఖ్యమైన వేదికగా నిలుస్తున్న బ్రిక్స్​లో సన్నిహిత సహకారానికి భారత్ విలువ ఇస్తుందని రష్యాకు వెళ్లేముందు ప్రధాని ఎక్స్​ వేదిక తెలిపారు. రెండు రోజుల బ్రిక్స్ సదస్సులో వివిధ అంశాలపై విస్తృతమైన చర్చల కోసం ఎదురుచూస్తున్నానని మోదీ పేర్కొన్నారు. గత సంవత్సరం కొత్త సభ్యుల చేరికతో బ్రిక్స్ విస్తరణ కూటమి సమగ్రతను, ప్రపంచ శ్రేయస్సు కోసం ఎజెండాను చేర్చేందుకు తోడ్పడిందని ప్రధాని వెల్లడించారు. ప్రపంచ అభివృద్ధి అజెండా, వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారం, సరఫరా గొలుసులను నిర్మించడం,సాంస్కృతిక అనుసంధానతను ప్రోత్సహించడం వంటి అంశాలపై బ్రిక్స్‌లో చర్చలు ఉంటాయన్నారు.

ఇక 'ప్రపంచాభివృద్ధి, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం' ప్రధాన నినాదంగా ఈ ఏడాది బ్రిక్స్ సదస్సు జరగుతుంది. ఈ సమిట్​లో సభ్య దేశాధినేతలు అందరూ పాల్గొంటున్నారు. అయితే బాత్రూమ్‌లో పడి తలకు గాయం కావడం వల్ల బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డా సిల్వా సదస్సుకు వర్చువల్​గా హాజరవుతున్నారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో బ్రిక్స్‌ కూటమి ఏర్పాటైంది. ఇప్పుడు దాన్ని విస్తరించి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలకూ సభ్యత్వం ఇచ్చారు. కూటమి విస్తరణ తర్వాత ఇదే తొలి శిఖరాగ్ర సదస్సు. ప్రధాని మోదీ రష్యా పర్యటన చేపట్టడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి.

ABOUT THE AUTHOR

...view details