Stock Market Close Today June 4, 2024 :కలలో కూడా ఊహించని రితీలో,కనీవినీ ఎరుగని నష్టాలతో దలాలా స్ట్రీట్ రక్తమోడింది. ఒకానొక దశలో సెన్సెక్స్ 6000 పాయింట్లు, నిఫ్టీ 1900 పాయింట్లకు పైగా నష్టపోయి మదుపరులకు కన్నీళ్లు మిగిల్చాయి. ఒక అంచనా ప్రకారం, ఈ ఒక్కరోజే దాదాపు రూ.35 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. మోదీ గెలుపేమో కానీ, మదుపరులకు మాత్రం ఈ రోజు తీరని ఆవేదన మిగిల్చింది.
దలాల్ స్ట్రీట్ ఢమాల్
బేర్ దెబ్బకు దలాల్ స్ట్రీట్ ఢమాల్ అయ్యింది. రోజంతా భారీ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు ట్రేడయ్యాయి. చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 4390 పాయింట్లు నష్టపోయి 72,079 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 1379 పాయింట్లు కోల్పోయి 21,884 వద్ద ముగిసింది.
- లాభపడిన స్టాక్స్ :హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే ఇండియా, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఏసియన్ పెయింట్స్, సన్ఫార్మా
- నష్టపోయిన స్టాక్స్ :ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, పవర్గ్రిడ్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్
ఎందుకిలా జరిగింది?
ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి భారీ మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. దీనితో సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. కానీ మంగళవారం పరిస్థితి మొత్తం తారుమారు అయ్యింది. ఇండియా బ్లాక్ నుంచి ఎన్డీఏ కూటమికి గట్టిపోటీ ఎదురైంది. బీజేపీ మళ్లీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చే అవకాశం బాగా తగ్గింది. దీని వల్ల ఇకపై బీజేపీ స్వయం నిర్ణయాధికారం బాగా తగ్గుతుంది. మిత్రపక్షాలపై ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఈ కారణంగానే మదుపరుల సెంటిమెంట్ బాగా దెబ్బతింది. ఫలితంగానే స్టాక్ మార్కెట్లు భారీ నష్టపోయాయి.
వాస్తవానికి ఈ రోజు ఏ దశలోనూ స్టాక్ మార్కెట్లు కోలుకోలేదు. ఒకానొక దశలో సెన్సెక్స్ 6000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 1900 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ప్రధానంగా నిఫ్టీ గత రెండేళ్లలో ఒకే రోజు అత్యంత దారుణమైన పతనాన్ని చవిచూసింది. దీనితో మదుపరులు భారీగా నష్టపోయారు. ఒక అంచనా ప్రకారం, ఈ ఒక్కరోజే మదుపరుల సంపద దాదాపు రూ.35 లక్షల కోట్లు ఆవిరైంది.
అన్ని రంగాలు నష్టాల్లోనే!
మంగళవారం దాదాపు అన్ని రంగాలు కూడా నష్టపోయాయి. ప్రధానంగా పీఎస్యూ స్టాక్స్, స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే భారీగా నష్టాలు చవిచూశాయి.