How to Make Gongura Pandumirchi Pachadi : గోంగూర పేరు చెబితే చాలు నోట్లో నీళ్లు ఊరని తెలుగువారు ఉండరేమో. పచ్చడి, కూర, తొక్కు, నాన్వెజ్ వంటకాలు ఇలా గోంగూరతో ఏది వండినా అమృతమే. అందుకే చాలా మంది దీనిని ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే, గోంగూరతో ఎన్ని వంటలు వండినా, అందరికీ ఫేవరెట్ అంటే గోంగూర పచ్చడి. అయితే ఆ గోంగూర పచ్చడి రుచిని మరింత పెంచేందుకు మీకోసం అద్దిరిపోయే రెసిపీ తీసుకొచ్చాం. అదే గోంగూర పండుమిర్చి పచ్చడి. ఇప్పుడు ఎలాగో మార్కెట్లో పండుమిర్చి దొరుకుతున్నాయి. కాబట్టి ఓసారి ఇలా పచ్చడి పెట్టుకుంటే రుచి అద్దిరిపోతుంది. పైగా ఈ కొలతలతో పెడితే సంవత్సరం పాటు నిల్వ. మరి లేట్ చేయకుండా ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- పండు మిరపకాయలు - పావు కేజీ
- గోంగూర ఆకులు - 400 గ్రాములు
- మెంతులు - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర - 1 టీ స్పూన్
- నూనె - పావు కప్పు
- చింతపండు - 20 గ్రాములు
- ఉప్పు - 75 గ్రాములు
- పసుపు - అర టీ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - పావు కప్పు
తాలింపు కోసం:
- నూనె - 6 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1 టీ స్పూన్
- జీలకర్ర - 1 టీ స్పూన్
- మినపప్పు - 1 టీ స్పూన్
- పచ్చి శనగపప్పు - 1 టీ స్పూన్
- ఎండు మిర్చి - 3
- దంచిన వెల్లుల్లి రెబ్బలు - 4
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఇంగువ - చిటికెడు
తయారీ విధానం:
- పండు మిరపకాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఓ పొడి క్లాత్తో తుడుచుకోవాలి. ఆపై తొడిమలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చింతపండులో కూడా గింజలు, పీచు లేకుండా శుభ్రంగా తీసేసి పక్కన పెట్టాలి.
- గోంగూరను కాడలు లేకుండా కేవలం ఆకులు మాత్రమే తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఓ మెత్తటి క్లాత్ మీద వేసి ఫ్యాన్ గాలికి రాత్రి మొత్తం ఆరబెట్టుకోవాలి. గోంగూర, పండు మిర్చిలో కొంచెం తేమ ఉన్నా పచ్చడి ఎక్కువ రోజుల నిల్వ ఉండదు. ఈ విషయం గుర్తుంచుకుని వాటిలో తేమ లేకుండా చూసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. మెంతులు వేగుతున్నప్పుడు జీలకర్ర వేసి మరోసారి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీజార్ లోకి వేసుకుని మెత్తని పొడి చేసి పక్కన ఉంచాలి.
- మరోసారి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత చింతపండు, గోంగూర ఆకులు వేసి కలుపుతూ తేమ లేకుండా మగ్గించుకోవాలి. నూనెలో గోంగూర బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి.
- మిక్సీజార్లోకి కట్ చేసిన పండుమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత వేయించిన మెంతులు జీలకర్ర పొడి, పూర్తిగా చల్లారిన గోంగూర వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడిని గాజు జార్లో పెట్టి ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది.
- ఈ పచ్చడి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్దిగా తాలింపు పెట్టుకోవచ్చు. లేదంటే పచ్చడి మొత్తాన్ని ఒకేసారి తాలింపు పెట్టుకున్నా నిల్వ ఉంటుంది.
- తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చి శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి మరోసారి ఫ్రై చేయాలి. చివరగా ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఇందులోకి గోంగూర పచ్చడిని వేసి కలిపి పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే అద్భుతంగా ఉండే గోంగూర పండుమిర్చి పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యితో ఈ పచ్చడిని తింటే అమృతమే. నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి.
పక్కా పల్లెటూరి రుచిలో - నోరూరించే "గోంగూర పచ్చడి" - ఇలా ప్రిపేర్ చేసుకుంటే వారం నిల్వ!