Womens Premiere League 2025 : ఐపీఎల్ కంటే ముందే క్రికెట్ లవర్స్కు వినోదం పంచేందుకు డబ్ల్యూపీఎల్ సిద్ధమైంది. అమ్మాయిల క్రికెట్లో మెరుపుల మేళా వచ్చేసింది! మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) సీజన్-3 శుక్రవారం ప్రారంభం కానుంది. గత రెండు సీజన్లలో అభిమానులను అలరించిన ఈ టోర్నీ మరోసారి ధనాధన్ ఆటను అందించేందుకు రెడీ అయ్యింది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గుజరాత్ జెయింట్స్ ఢీకొట్టనుంది.
తొలి మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ గుజరాత్
యువ క్రికెటర్ల టాలెంట్ను వెలుగులోకి తెచ్చేందుకు, అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చేందుకు డబ్ల్యూపీఎల్ మళ్లీ వచ్చేసింది. ప్లేయర్ల ప్రతిభా పాటవాలకు శుక్రవారం మొదలయ్యే సీజన్-3 వేదిక కానుంది. టైటిల్ నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలో దిగుతున్న స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీసీ, ఆష్లే గార్డ్నర్ కెప్టెన్సీలోని గుజరాత్తో తొలి మ్యాచ్లో ఆడనున్నాయి.
ఆర్సీబీపై భారీ అంచనాలు
పురుషుల్లో, మహిళల్లో కలిపి తొలిసారి ఓ టైటిల్ గెలిచిన ఆర్సీబీపై ఈసారి అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ టైటిల్ నిలబెట్టుకోవడం ఆ జట్టుకు అంత ఈజీ కాదు. స్టార్ ప్లేయర్లు సోఫీ డివైన్, సోఫీ మోలినూ, ఆశ శోభన గాయాలతో టోర్నీ నుంచి వైదొలిగారు. అలీస్ పెర్రీ, శ్రేయాంక పాటిల్ గాయాల నుంచి కోలుకుంటున్నారు. ఈ స్థితిలో జట్టు ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. "గతేడాది టైటిల్ గెలిచిన బెంగళూరు జట్టులో ఉన్న కొంతమంది కీలక ప్లేయర్లు ఈసారి గాయాలతో ఆటకు దూరమయ్యారు. ఇది క్లిష్టమైన పరిస్థితే. కానీ మానసికంగా సిద్ధం కావాలి" అని ఆర్సీబీ కెప్టెన్ స్మృతి వ్యాఖ్యానించింది.
Your Valentine’s day plan: To watch them bat. 🤩#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2025 #GGvRCB pic.twitter.com/9AjVLik1Gh
— Royal Challengers Bengaluru (@RCBTweets) February 14, 2025
యంగ్ ప్లేయర్లకు ఛాన్స్
ఐపీఎల్ మాదిరే డబ్ల్యూపీఎల్ టీమ్ఇండియాకు వారధిగా పనిచేస్తోంది. డబ్ల్యూపీఎల్లో రాణిస్తే జాతీయ జట్టులో అవకాశం లభించడం కష్టమేం కాదు. శ్రేయాంక పాటిల్, ఆశ శోభన, సైకా ఇషాక్ అలానే టీమ్ఇండియాకు ఎంపిక అయ్యారు. వీరు గత డబ్ల్యూపీఎల్ సీజన్లో బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి కూడా కొంతమంది యువ ప్లేయర్లు సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. పేసర్ కమ్ ఆల్ రౌండర్ ఖాష్వి గౌతమ్, సిమ్రన్ షేక్ లాంటి వాళ్లు తఈ జాబితాలో ఉన్నారు.
5 టీమ్లు- 22 మ్యాచ్లు
డబ్ల్యూపీఎల్ సీజన్-3లో గతేడాది మాదిరే ఈసారి కూడా 5 టీమ్లు పాల్గొంటాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, యూపీ వారియర్స్ డబ్ల్యూపీఎల్ ఆడనున్నాయి. ప్రతి జట్టు లీగ్ దశలో తమ ప్రత్యర్థి జట్లతో రెండేసిసార్లు ఆడుతుంది. లీగ్లో మొత్తం 22 మ్యాచ్లు జరుగుతాయి. ఈ దశలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న జట్టు నేరుగా ఫైనల్ కు చేరుతుంది. తర్వాతి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్లు ఫైనల్ బెర్తు కోసం ఎలిమినేటర్లో తలపడతాయి.
ఆర్సీబీ బలాలు, బలహీనతలు
తొలి సీజన్లో నాలుగో స్థానంలో నిలిచిన ఆర్సీబీ రెండో సీజన్లో అంచనాలకు అందకుండా ట్రోఫీని గెలుచుకుంది. ఈసారి కీలక ప్లేయర్లు గాయాల బారిన పడటం ఆ జట్టుకు ప్రతికూలాంశంగా మారింది. కెప్టెన్ స్మృతి మంధానే ఆ జట్టుకు పెద్ద బలం అని చెప్పాలి. ఆమె ఫామ్లో ఉంది. గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్రౌండర్ ఎలీస్ పెర్రీ ఏ మాత్రం రాణిస్తుందో చూడాలి. గత సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న పెర్రీ (347 పరుగులు) ఆడడం ఆర్సీబీకి అవసరం. పేసర్ జోషిత, లెగ్ స్పిన్నర్ ప్రేమ రావత్ ఆ జట్టుకు మరింత బలంగా మారారు. గాయపడిన ఆశ శోభన స్థానంలో వికెట్కీపర్ బ్యాటర్ నజ్హత్ పర్వీన్ ఆర్సీబీ జట్టులో చోటు సంపాదించుకుంది.
ముంబయి ఇండియన్స్
హర్మన్ప్రీత్ కౌర్ లాంటి అనుభవం ఉన్న కెప్టెన్, అమేలి కెర్, నటాలి సివర్ లాంటి స్టార్ ఆల్రౌండర్ల అండ! అందుబాటులో నాణ్యమైన కోచింగ్ వనరులు డబ్ల్యూపీఎల్లో ముంబయి ఇండియన్స్ అత్యంత బలమైన జట్టుగా మారుస్తున్నాయి. తొలి సీజన్లోనే ఛాంపియన్ అయినా, రెండో సీజన్లో తడబడింది. ఎలిమినేటర్లో ఓడి మూడో ప్లేస్ తో సరిపెట్టుకుంది. ఈసారి అవకాశాన్ని వదులకూడదని ముంబయి జట్టు భావిస్తోంది. అండర్-19 ప్రపంచకప్లో సత్తా చాటిన ఓపెనర్ కమలినిని వేలంలో ఏకంగా రూ.1.90 కోట్లు పెట్టి జట్టులోకి తీసుకుంది. షబ్నిమ్ ఇస్మాయిల్, హేలీ మాథ్యూస్ కూడా ముంబయిలో కీలక ప్లేయర్లుగా ఉన్నారు. గాయపడిన పూజ వస్త్రాకర్ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పౌర్ణిక సిసోదియా జట్టులోకి వచ్చింది.
సత్తా చాటాలని
తొలి రెండు సీజన్లలో గుజరాత్ జెయింట్స్కి ఆఖరి స్థానంలోనే నిలిచింది. ఈసారైనా ప్రదర్శన మెరుగుపరుచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కెప్టెన్ అష్లే గార్డ్నర్తో పాటు డెండ్రా డాటిన్, లారా వోల్వార్ట్, లిచ్ఫీల్డ్, బెత్ మూనీ లాంటి స్టార్లు ఉన్నా దేశీయ ప్లేయర్లు రాణించకపోవడం గుజరాత్కు మైనస్ గా మారింది. హర్లీన్ డియోల్, కొత్తగా జట్టులోకి వచ్చిన ఫాస్ట్ బౌలర్ డానిలీ గిబ్సన్, యువ బ్యాటర్ సిమ్రన్ షేక్ సత్తా చాటాల్సి ఉంది.
ఈసారైనా అదృష్టం వరించేనా?
దురదృష్టం అంటే దిల్లీ క్యాపిటల్స్దే అని చెప్పాలి. వరుసగా 2023, 2024 సీజన్లలో ఫైనల్కు వెళ్లిన దిల్లీ రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకుంది. కానీ మూడో ప్రయత్నంలోనైనా కప్ పట్టాలని ఆ జట్టు ఆశపడుతోంది. కెప్టెన్ మెగ్ లానింగ్, మరిజేన్ కాప్తో పాటు షెఫాలీవర్మ, జెమీమా రోడ్రిగ్స్, ఆల్రౌండర్లు రాధ, మిన్నుమణి ఈసారి దిల్లీ రాత మారుస్తారేమో చూడాలి. అండర్-19 టీ20 ప్రపంచకప్లో భారత్ను విజయపథంలో నడిపించిన నికీ ప్రసాద్ కూడా దిల్లీ జట్టులోనే ఉంది.
జోరు చూపి రాణించేనా?
డబ్ల్యూపీఎల్లో యూపీ వారియర్స్ స్థిరంగానే రాణించినా కీలక మ్యాచ్ల్లో తడబాటుకు గురవుతోంది. తొలి సీజన్లో మూడో స్థానంలో నిలిచిన యూపీ, గతేడాది నాలుగో స్థానంలో నిలిచింది. యూపీ వారియర్స్ కెప్టెన్, ఆల్రౌండర్ దీప్తిశర్మ ఈ జట్టుకు పెద్ద బలం అని చెప్పాలి. కానీ ఆమెకు మిగిలిన ప్లేయర్ల నుంచి సహకారం అందట్లేదు. చమరి ఆటపట్టు కూడా యూపీలో ఇంకో కీలక ప్లేయర్ గా ఉన్నారు. అలానా కింగ్, గ్రేస్ హారిస్ లాంటి స్టార్లు రాణిస్తే ఆ జట్టు ఈసారి మెరుగైన పెర్ఫామెన్స్ చేసే అవకాశాలు ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరంటే?
డబ్ల్యూపీఎల్ లో తెలుగు రాష్ట్రాల నుంచి మేఘన (బెంగళూరు), అరుంధతి రెడ్డి (దిల్లీ), అంజలి శర్వాణి, గౌహర్ (యూపీ), శ్రీచరణి (దిల్లీ), షబ్నమ్ (గుజరాత్) ఆడుతున్నారు. మేఘన 13 మ్యాచ్ల్లో 249 రన్స్ చేయగా, అంజలి 13 మ్యాచ్ల్లో 6 వికెట్లు తీసింది. అరుంధతి 16 మ్యాచ్ల్లో 10 వికెట్లు పడగొట్టింది. గత సీజన్లోనూ షబ్నమ్, గౌహర్ ఆడారు.
WPL 2025కు రంగం సిద్ధం- షెడ్యూల్ రిలీజ్
WPL 2025 రిటెన్షన్- ఆర్సీబీ, ముంబయి స్ట్రాంగ్- ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుందంటే?