Mutual Fund KYC New Rules :మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. కేవైసీ నిబంధనల్ని స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (సెబీ) మరింత సులభతరం చేసింది. కేవైసీ రిజిస్టర్డ్ స్టేటస్ కోసం ఆధార్- పాన్ లింక్ చేయడం తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన నిబంధనల్ని సడలించింది. ఈమేరకు సెబీ సర్క్యులర్ను విడుదల చేసింది.
మోసాలకు చెక్!
బ్యాంకులు, ఫండ్ హౌస్లు, స్టాక్ బ్రోకర్లు పెట్టుబడి ప్రారంభించే ముందు గుర్తింపును ధ్రువీకరించే ప్రక్రియనే కేవైసీ అంటారు. పారదర్శక వాతావరణంలో మదుపరులు తమపెట్టుబడులను నిర్వహించేందుకు వీలు కల్పించడం సహా, మోసపూరిత కార్యకలాపాలను నిరోధించేందుకు కేవైసీ ప్రక్రియను చేపడతారు. కాగా, అంతకుముందు పాన్- ఆధార్ లింక్ చేయకపోతే కేవైసీ హోల్డ్లో ఉండేది. అంటే తిరిగి పెట్టుబడులు పెట్టడానికి అనుమతి ఉండేది కాదు. ఈ కేవైసీ ప్రక్రియను 2024 మార్చి 31లోపు కచ్చితంగా పూర్తి చేయాలని 2023 అక్టోబర్లోనే సెబీ ఆదేశాలు జారీ చేసింది. లేదంటే మార్చి 31 నుంచి కొత్త పెట్టుబడులను అనుమతించమని స్పష్టం చేసింది. ఈ మార్పు కారణంగా అనేక మ్యూచువల్ ఫండ్ ఖాతాలు తాత్కాలిక సస్పెన్షన్కు గురయ్యాయి. కేవైసీ అసంపూర్తిగా ఉన్న 13 మిలియన్ ఖాతాలు ఇబ్బందుల్లో పడ్డాయి. మే 14న జారీ చేసిన సర్క్యులర్లో సెబీ ఈ నిబంధనల్ని సడలించింది.