తెలంగాణ

telangana

ETV Bharat / business

'AIతో జాబ్స్ పోవు - అలా చేసే వారి వల్లే ఉద్యోగాలు పోతాయి'

ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్​లో ఎన్విడియా ఏఐ సమిట్ - ఏఐ వల్ల ఉద్యోగాల కోతపై ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు

Nvidia AI Summit 2024
Nvidia AI Summit 2024 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Nvidia AI Summit 2024 :కృత్రిమ మేధ(ఏఐ) ఉద్యోగాలను హరించుకుపోదని, కానీ ఆ సాంకేతికతను ఉపయోగించి ఓ వ్యక్తి మెరుగ్గా పని చేస్తే మిగిలిన వారు ఆ అవకాశాన్ని కోల్పోతారని ఎన్విడియా వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ అన్నారు. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్​లో నిర్వహించిన ఎన్విడియా ఏఐ సమిట్​- 2024 ఈ వ్యాఖ్యలు చేశారు. సాఫ్ట్​వేర్​ను ఎగుమతి చేస్తున్న భారతదేశం భవిష్యత్​లో ఏఐను సరఫరా చేస్తుందని పేర్కొన్నారు.

'భారత్​- కంప్యూటర్‌ రంగంలో ప్రపంచానికి సుపరిచితం. భారత్‌ త్వరలో ప్రభావవంతమైన ఏఐ సొల్యూషన్స్​ను ఎగుమతి చేయనుంది. ప్రస్తుతం ఇండియా సాఫ్ట్​వేర్​ ఎగుమతులు కేంద్రంగా ఉంది. భవిష్యత్​లో ఏఐ అభివృద్ధి, ఎగుమతి చేసే పవర్​హౌస్​గా మారునుంది. భవిష్యత్​లో ప్రతి వ్యక్తికి ఓ సొంత ఏఐ కోపైలట్లు ఉండనున్నాయి. 2024లో భారత్​ కంప్యూటర్​ సామర్థ్యాల్లో 20 శాతం వృద్ధిని సాధిస్తుంది. భారత దేశంలో మా ఎకోసిస్టమ్ విస్తరించేందుకు చూస్తున్నాం. ఇక ఏఐ పూర్తిగా ఉద్యోగాలను హరించుకుపోదు. కానీ ఏఐను ఉపయోగించి మెరుగ్గా పని చేసే వ్యక్తి వల్ల ఉద్యోగం పోతుంది' అని జెన్సన్​ హువాంగ్ అన్నారు.

ఎన్విడియాలో మూడోవంతు భారతీయులే
భారత్‌లో ఏఐ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఓ ఇన్నోవేషన్​ సెంటర్​ను నిర్మించడానికి రిలయన్స్‌తో ఎన్విడియా ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు జెన్స్​న్ హువాంగ్ ప్రకటించారు. సమ్మిట్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీతో భేటీ అయిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే చిప్​ల తయారీలో భారత్ ప్రపంచ దేశాల సరసన ఉందని పేర్కొన్నారు. ఎన్విడియాలో మూడోవంతు కంటే ఎక్కువ మంది భారతీయలు ఉండొచ్చని పేర్కొన్నారు. ఆరేళ్ల కిందటే తన క్యాబినెట్​లో ఏఐ గురించి ప్రసంగించమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అడిగినట్లు తెలిపారు. అలా తనను ఏఐ గురించి చెప్పమని పిలిచిన మొదటి వ్యక్తి మోదీ అని చెప్పారు.

ప్రపంచానికే భారత్ ఏఐ సేవలు
భవిష్యత్​లో​ ఏఐతో భారత్ సాధించిన విజయాలు చూసి​ ప్రపంచమే ఆశ్చర్యపోతుందని ముకేశ్ అంబానీ అన్నారు. ఏఐ వంటి టెక్నాలజీలు, ప్రజల ఆకాంక్షలు భారత ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయని చెప్పారు. ప్రపంచానికి భారత్​ కేవలం సీఈఓలను మాత్రమే కాకుండా, ఏఐ సేవలను కూడా అందజేస్తుందని పేర్కొన్నారు. అమెరికా, చైనా తర్వాత పెద్ద డిజిటల్‌ కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ భారత్‌ కలిగి ఉందని ముకేశ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details