Gold Bonds 2024 Subscription : సావరిన్ గోల్డ్ బాండ్ 2023-24 సిరీస్ నాలుగో విడత సబ్స్క్రిప్షన్ ఫిబ్రవరి 12న ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16 వరకు ఈ గోల్డ్ బాండ్ సబ్స్క్రిప్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
గ్రాము ధర ఎంతంటే?
Sovereign Gold Bonds Series IV : ఆర్బీఐ ఒక గ్రాము బంగారం ఇష్యూ ధరను రూ.6199గా నిర్ణయించింది. ఆర్బీఐ ప్రతీ ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికానికి ఒకటి చొప్పున మొత్తం 4 సార్లు గోల్డ్ బాండ్లు ఇష్యూ చేస్తుంది. ఇంతకు ముందు 2023 జూన్లో మొదటి విడత, సెప్టెంబర్లో రెండో విడత, డిసెంబర్లో మూడో విడత పసిడి బాండ్లను విడుదల చేసింది. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో నాలుగో సిరీస్ గోల్డ్ బాండ్లను విడుదల చేయనుంది.
డిస్కౌంట్ వారికి మాత్రమే!
Sovereign Gold Bond Discount Price : ఆన్లైన్లో పసిడి బాండ్లు కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ.50 చొప్పున డిస్కౌంట్ ఇస్తారు. అంటే ఆన్లైన్లో కొనుగోలు చేసేవారికి ఒక గ్రాము బంగారం రూ.6,149కే లభిస్తుంది.
బంగారం ధర ఎలా నిర్ణయిస్తారంటే?
దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలనే ఉద్దేశంతో 2015 నవంబర్లో ఈ పసిడి బాండ్ల పథకాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ పసిడి బాండ్ల ధరను ఎలా నిర్ణయిస్తారంటే, సబ్స్క్రిప్షన్ ముందు వారంలోని చివరి మూడు పనిదినాల్లో 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ఒక సగటు ధరను నిర్ణయిస్తుంది. ఇలా నిర్ణయించిన సగటు ధర ఆధారంగా గ్రాము బంగారం రేటును నిర్ణయిస్తారు. సబ్స్క్రైబర్లు కనీసం 1 గ్రామును ఒక యూనిట్ కింద కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఎంత బంగారం కొనవచ్చు?
Sovereign Gold Bond Subscription Limit : ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు గరిష్ఠంగా 4 కేజీల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు అయితే 20 కేజీల వరకు గోల్డ్ కొనవచ్చు. ఈ గోల్డ్ బాండ్ పీరియడ్ 8 ఏళ్లు. గడువు ముగిసిన తరువాత, అప్పటికి ఉన్న ధరను చెల్లిస్తారు. సబ్స్క్రైబర్లు కావాలంటే, ఐదేళ్ల తర్వాత ఈ పథకం నుంచి వైదొలగవచ్చు. భౌతిక బంగారం కొనుగోలుకు ఉన్న కేవైసీ నిబంధనలే గోల్డ్ బాండ్స్కు కూడా వర్తిస్తాయి.
ఎక్కడ అప్లై చేయాలి?
How To Subscribe Sovereign Gold Bond : షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, పోస్టాఫీస్లు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE, BSE)ల్లో ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు.