Surrogacy Maternity Leave : సరోగసీ విషయంలో 50 ఏళ్ల నాటి నిబంధనను కేంద్రం సవరించింది. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే మహిళలకు, ఆ పిల్లల తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సరోగసీ ద్వారా తల్లి అయిన మహిళకు 180 రోజుల ప్రసూతి సెలవులు, తండ్రులు కూడా 15 రోజులపాటూ పితృత్వ సెలవులను తీసుకోవచ్చు. ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్-1972ను సవరించింది.
కొత్త నిబంధనలు ప్రకారం అద్దె గర్భం ధరించేవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే 180 రోజుల ప్రసూతి సెలవులు పొందుతారు. అలాగే ఇద్దరు కంటే తక్కువ పిల్లలున్న ప్రభుత్వ ఉద్యోగి తల్లికి (గర్భంలోని బిడ్డను స్వీకరించే తల్లి) కూడా ఈ సెలవులు లభిస్తాయి. ఇక ఈ సవరించిన సరోగసీ కేసుల్లో పితృత్వ సెలవులకు కూడా ప్రభుత్వం అనుమతించింది. సాధారణ పురుష ఉద్యోగులకు ఇచ్చే విధంగానే సరోగసీ విధానం ద్వారా తండ్రిగా మారిన వారికి కూడా సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే బిడ్డకు జన్మించిన ఆరు నెలల్లోపు 15 రోజుల పాటు పితృత్వ సెలవులు తీసుకోవచ్చు. అయితే అతడికి కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదని షరతు విధించింది. సరోగసీ ద్వారా బిడ్డ పుడితే ఆ మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనే నిబంధనలు ఇప్పటి వరకు లేవు. తాజాగా ఆ నిబంధనలను సవరించి కొత్త రూల్స్ను తీసుకొచ్చంది కేంద్ర ప్రభుత్వం. సవరించిన కొత్త రూల్స్ జూన్ 18నుంచి అమల్లోకి వచ్చాయి.