Chhattisgarh Encounter :ఛత్తీస్గఢ్లో జరిగిన మరో భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలోనే ఇద్దురు సైనికులు ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. మావోయిస్టుల కోసం డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పశ్చిమ బస్తర్ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టుల కదలికలకు సంబంధించి భద్రతా దళాలకు కీలక సమాచారం అందింది. దీంతో బీజాపుర్ జిల్లాలోని ఇంద్రావతీ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఆదివారం భద్రతా బలగాలు యాంటీ మావోయిస్టు ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై బస్తర్ ఐజీ పి.సుందర్రాజు స్పందించారు .భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మరణించినట్లు ధ్రువీకరించారు.
ఛత్తీస్గఢ్ చరిత్రలోనే రెండో భారీ ఎన్కౌంటర్గా దీన్ని పేర్కొంటున్నారు. గతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 41 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2026 నాటికి మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం తుడిచిపెడుతుందని జనవరి 6న కేంద్ర హోం మంత్రి అమిత్షా పేర్కొన్న నేపథ్యంలో ఆపరేషన్లు వేగవంతమయ్యాయి.
నక్సలిజం వల్ల ఏ పౌరుడూ ప్రాణాలు కోల్పోకూడు : అమిత్ షా
ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చే దిశగా భద్రతాదళాలు భారీ విజయాన్ని సాధించాయని తెలిపారు. వచ్చే ఏడాది మార్చినాటికి నక్సలిజాన్ని పెకిలించివేస్తామని 'ఎక్స్' వేదికగా పునరుద్ఘాటించారు. "ఛత్తీస్గఢ్లో చేపట్టిన భారీ ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. అదేవిధంగా పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మానవత్వానికి వ్యతిరేకమైన నక్సలిజాన్ని అంతం చేసే ప్రయత్నంలో ఇద్దరు జవాన్లను కూడా కోల్పోయాం. ఈ అమరవీరులకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామనే సంకల్పాన్ని కూడా పునరుద్ఘాటిస్తున్నాను. దేశంలోని ఏ పౌరుడూ దాని కారణంగా ప్రాణాలు కోల్పోకూడదు" అని అమిత్ షా పేర్కొన్నారు.