తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 9:08 PM IST

Updated : Mar 28, 2024, 9:54 PM IST

ETV Bharat / bharat

మాజీ సీఎం కొడుకు ఆస్తి రూ.700 కోట్లు- 5ఏళ్లలో డీకే ప్రాపర్టీ 75 శాతం జంప్​! - Politicians Assets

Politicians Assets : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం కుమారుడు, ఎంపీ నకుల్​నాథ్​తోపాటు కర్ణాటక డిప్యూటీ సీఎం తమ్ముడు, డీకే సురేశ్ తమ ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఐదేళ్లలో నకుల్ నాథ్ సంపద 40 రెట్లు పెరగ్గా, సురేశ్ ఆస్తులు 75 శాతం పెరిగడం గమనార్హం.

Politicians Assets
Politicians Assets

Politicians Assets :దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే ఏప్రిల్ 19న జరగనున్న తొలిదశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలుకు గడువు ముగియగా, రెండో విడత పోలింగ్​కు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా పలువురు నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేశ్, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్​ రేవణ్ణ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిద్దరితోపాటు మధ్యప్రదేశ్ ఏకైక కాంగ్రెస్​ ఎంపీ నకుల్​నాథ్​ ఆస్తుల వివరాలు బయటకొచ్చాయి.

నకుల్​ నాథ్​కు రూ.700 కోట్ల ఆస్తి!
మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్​ కుమారుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ నకుల్​ నాథ్​​ మరోసారి ఛింద్వాడా నుంచి బరిలో దిగారు. ఈ సందర్భంగా తన ఎన్నికల అఫిడవిట్​లో దాదాపు రూ.700 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఆయన అఫిడవిట్ ప్రకారం గత ఐదేళ్లలో నకుల్ నాథ్ సంపద రూ.40 కోట్లు పెరిగింది. అయితే నకుల్​ నాథ్​ తరచూ హెలికాప్టర్​ను వాడుతున్నా, తన వద్ద కారు కూడా లేనట్లు అఫిడవిట్​లో తెలిపారు.

నగదు, షేర్లు, బాండ్లు కలిపి రూ.649.51 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు నకుల్ ​నాథ్​ ఎన్నికల కమిషన్‌కు అందించిన అఫిడవిట్​లో పేర్కొన్నారు. రూ.48.07 కోట్ల స్థిరాస్తులున్నట్లు తెలిపారు. 2019లో రూ.660 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు నకుల్​నాథ్​. గత ఎన్నికల్లో 29 లోక్​సభ స్థానాల్లో 28 చోట్ల బీజేపీ గెలవగా, ఏకైక కాంగ్రెస్ ఎంపీగా నకుల్​ నాథ్​ నిలిచారు.

డీకే సురేశ్​కు రూ.593 కోట్ల ఆస్తులు
కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్​కు రూ.593 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తన ఆస్తులను రూ.339 కోట్లుగా ప్రకటించారు సురేశ్. దీని బట్టి చూస్తే ఆయన ఆస్తి ఐదేళ్లలో 75 శాతం పెరిగిందన్నమాట. బెంగళూరు రూరల్ నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన గురువారం దాఖలు చేసిన నామినేషన్​లో ఆస్తుల వివరాలు పొందుపరిచారు.

అఫిడవిట్ ప్రకారం, సురేశ్​​కు బ్యాంకుల్లో రూ.16.61 కోట్ల డిపాజిట్లు, 21 ప్రాంతాల్లో రూ.32.76 కోట్ల విలువైన భూమి, 27 చోట్ల రూ.211.91 కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి, రూ.211.91 కోట్ల విలువైన తొమ్మిది వాణిజ్య భవనాలు, రూ.27.13 కోట్ల విలువైన మూడు నివాస భవనాలు ఉన్నాయి. వీటితోపాటు రూ.150.06 కోట్ల అప్పులు ఉన్నాయి.

దేవెగౌడ మనవడికి రూ.40కోట్ల ఆస్తి
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తనకు రూ.40.85 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్​లో ప్రకటించారు. డిపాజిట్లు,పెట్టుబడులు, నగలు సహా రూ.5.45 కోట్ల విలువైన చరాస్తులు, రూ.35.84 కోట్ల స్థిరాస్తులున్నట్లు వెల్లడించారు. రూ.4.49 కోట్లు అప్పులు, రూ.3.04 కోట్ల ప్రభుత్వ బకాయిలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తన మొత్తం ఆస్తుల విలువ రూ.9.78 కోట్లుగా ప్రకటించారు. తన సిట్టింగ్ స్థానం హసన్​ నుంచే మళ్లీ పోటీ చేస్తున్నారు ప్రజ్వల్​.

Last Updated : Mar 28, 2024, 9:54 PM IST

ABOUT THE AUTHOR

...view details