Baba Siddiqui Murder Case :మహారాష్ట్ర మాజీ మంత్రి, అజిత్ పవార్ వర్గ ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీని దుండగులు పక్కా ప్రణాళికతోనే హత్య చేశారని ముంబయి పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు కొన్ని నెలల ముందు నుంచే సిద్దిఖీ నివాసం, కార్యాలయాల వద్ద నిందితులు రెక్కీ నిర్వహించినట్లు వెల్లడించారు. మరోవైపు బాబా సిద్ధిఖీకి, ఓ మురికివాడ పునరావాస ప్రాజెక్టు విషయంలో వ్యాపార వివాదాలే ఈ సుపారీ హత్యకు కారణమై ఉండొచ్చన్న కోణంలోనూ ముంబయి క్రైమ్ బ్రాంచ్ విచారణ జరుపుతోంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని పంపినట్లు దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తెలిపింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పతనమయ్యాయంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఇక ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరొకరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురు నిందితులపై ఆయుధాల చట్టం, భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అరెస్టైన నిందితుల్లో ఒకరు హరియాణాకు చెందిన గుర్మెయిల్ బల్జీత్ సింగ్ (23) కాగా, మరొకరు ఉత్తర్ప్రదేశ్కు చెందిన ధర్మరాజ్ రాజేశ్ కష్యప్(19)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు గత రెండు నెలల నుంచే సిద్దిఖీ నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్లు విచారణలో తేలిందని చెప్పారు. కొన్ని రోజుల ముందే నిందితులకు ఆయుధాలు అందాయని, కాల్పులు జరిపిన తర్వాత తప్పించుకునేందుకు ఘటనా సమయంలో బాణాసంచా పేల్చినట్లు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ బృందం క్రైమ్ స్పాట్ను సందర్శించి నమూనాలను సేకరించిందని, సమీప ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు సిద్ధిఖీ హత్యకు నిరసనగా ఆదివారం పార్టీ కార్యకాలపాలన్నింటినీ రద్దు చేశామని ఎన్సీపీ ప్రకటించింది.
'2-3 రోజుల్లో నిజం తెలుస్తుంది'
ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. 'ముంబయిలో జరిగిన ఘటనను నేను నమ్మలేకపోతున్నా. ఆయన ఏళ్ల తరబడి పని చేశారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. మేము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. దీని వెనుక ఎవరున్నారో రెండు, మూడు రోజుల్లో తెలుస్తుందని నేను నమ్ముతున్నా. ప్రతిపక్షాలు ప్రభుత్వాని నిందిస్తున్నాయి. కానీ మా పని లా అండ్ ఆర్డర్ను చూసుకోవడం. ఆదివారం రాత్రి 8:30 గంటలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తాం' అని అజిత్ పవార్ తెలిపారు.