Madhya Pradesh Students Rape Case : మహిళా లెక్చరర్గా నమ్మించి, స్కాలర్షిప్ పని పేరిట విద్యార్థినులను పిలిచి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి. వాయిస్ మార్చే యాప్ ద్వారా విద్యార్థినులకు ఫోన్ చేసి నమ్మించాడు. వేర్వేరు ఘటనల్లో ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థినులపై ఇలా దారుణానికి ఒడిగట్టాడు. అయితే, వారి సంఖ్య ఎక్కువే ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల్లో చాలామంది గిరిజనులే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 16 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
యాప్ సాయంతో గొంతు మార్చి
పోలీసుల వివరాల ప్రకారం, సీధీ జిల్లాకు చెందిన బ్రజేశ్ ప్రజాపతి (30) ఓ యాప్ సాయంతో ఓ కళాశాల మహిళా లెక్చరర్గా గొంతు మార్చి, స్కాలర్షిప్ పని ఉందంటూ విద్యార్థినులకు ఫోన్ చేసేవాడు. 'నా కుమారుడు మిమ్మల్ని మా ఇంటికి తీసుకువస్తాడు' అని ఆ లెక్చరర్ చెప్పినట్లు మాట్లాడేవాడు. అది నిజమని నమ్మి వచ్చిన బాలికలను తన బైక్పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడు. అనంతరం వారి వద్ద నుంచి ఫోన్ లాక్కొని పరారయ్యేవాడు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు మే 16న తొలి కేసు, అనంతరం మరో మూడు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
వాట్సాప్ గ్రూప్ నుంచి నంబర్లు సేకరించి
దర్యాప్తులో భాగంగా నిందితుడి చేతిపై కాలిన గాయాల గుర్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే చివరకు అతడిని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఏడుగురిపై అత్యాచారానికి పాల్పడినట్లు అతడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. బాధితుల సంఖ్య ఎక్కువే ఉండొచ్చని, ఈ దిశగా దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. అతడికి సాయం చేసిన లవ్కుశ్ ప్రజాపతి, రాహుల్ ప్రజాపతి, సందీప్ ప్రజాపతిలనూ అరెస్టు చేశామన్నారు. వీరిలో ఒకరు కళాశాల విద్యార్థి అని, కాలేజీ వాట్సాప్ గ్రూప్ నుంచి విద్యార్థినుల ఫోన్ నంబర్లు సేకరించినట్లు చెప్పారు. అయితే, ఆయా ఘటనల్లో వీరి పాత్రపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.