Assembly Election 2024 : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. వీటితోపాటు నాందేడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా శనివారమే జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం మహారాష్ట్రవ్యాప్తంగా 288 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు 288 మంది పరిశీలకులను ఈసీ నియమించింది. ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు. నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని చేయాల్సి ఉంది.
మూడు అంచెల భద్రత
కౌంటింగ్ సజావుగా సాగేందుకు కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సెంట్రల్ భద్రత బలగాలు, రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులను మోహరించినట్లు వెల్లడించారు. స్ట్రాంగ్రూమ్లలో ఈవీఎంలు సీసీటీవీ నిఘాలో ఉన్నాయని, వాటి ఫుటేజీని అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్రూమ్లను తెరవనున్నట్లు చెప్పారు. ముంబయిలో 36 కౌంటింగ్ కేంద్రాలకు 300 మీటర్ల దూరం వరకు ప్రజలు గుమిగూడడాన్ని పోలీసులు నిషేధించారు. నవంబర్ 24 అర్ధరాత్రి వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపారు.