తెలంగాణ

telangana

కామెంట్స్ ఎఫెక్ట్- సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ నో ఛాన్స్- సీనియారిటీ ఉన్నా డోంట్​ కేర్​! - Loksabha Polls 2024

Loksabha Polls Controversial BJP MPs Missed Seats : సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ పార్టీ అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవారితోపాటు స్థానికంగా వ్యతిరేకత ఉన్నవారిని పక్కన పెడుతోంది. అయితే తమ వ్యాఖ్యలతో సీటును కోల్పోయిన బీజేపీ ఎంపీలు ఎవరంటే?

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 10:36 PM IST

Published : Mar 25, 2024, 10:36 PM IST

Loksabha Polls Controversial BJP MPs Missed Seats
Loksabha Polls Controversial BJP MPs Missed Seats

Loksabha Polls Controversial BJP MPs Missed Seats :త్వరలో జరగబోయే లోక్​సభ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోన్న బీజేపీ, ప్రత్యర్థులకు తమ అభ్యర్థులపై విమర్శలు గుప్పించే అవకాశం కల్పించకుండా జాగ్రత్త పడుతోంది. దీనికోసం అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన, స్థానికంగా వ్యతిరేకత ఉన్న నాయకులకు టెకిట్ నిరాకరిస్తోంది. ఈక్రమంలో నేతల సీనియారిటీ కూడా లెక్కచేయడం లేదు. ఇక ఈ జాబితాలో తాజాగా కర్ణాటక బీజేపీ నాయకుడు అనంతకుమార్‌ హెగ్డే కూడా చేరారు.

ఆరు పర్యాయాలు ఎంపీ అయినా!
అనంతకుమార్‌ హెగ్డే, ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా ఎన్నికవుతున్నారు. 28 ఏళ్లలో ఆరు సార్లు గెలిచారు. అందులో నాలుగు సార్లు వరుసగా విజయం సాధించారు. అలాంటి సీనియర్‌ నేత నోటి దురుసుతనమే ఆయన సీటుకు చేటు తెచ్చినట్లు తెలుస్తోంది. రాజ్యాంగాన్ని మార్చాలంటే బీజేపీ 400 స్థానాల్లో గెలవాల్సి ఉంటుందని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో హెగ్డే వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బీజేపీ కూడా ప్రకటించింది. ఈనేపథ్యంలోనే తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర కన్నడ నుంచి అనంతకుమార్‌ను తప్పించి మాజీ స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డేకు కమల దళం అవకాశం కల్పించింది.

ఫైర్‌బ్రాండ్‌గా పేరొందినా!
మధ్యప్రదేశ్​లోని భోపాల్‌ ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకుర్‌ కూడా హెగ్డే తరహా పరిస్థితినే ఎదుర్కొన్నారు. బీజేపీ విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. ఫైర్‌బ్రాండ్‌గా పేరున్నా గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం కావొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గాడ్సేను దేశభక్తుడని ఆమె అభివర్ణించడం గతంలో వివాదాస్పదమైంది. ఈవిషయంపై ఇటీవల ప్రజ్ఞా ఠాకుర్‌ స్పందించారు. తనను క్షమించలేనని ప్రధాని మోదీ గతంలోనే చెప్పారని తెలిపారు. తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయనను ఇబ్బందికి గురిచేశాయని చెప్పారు.

సభలో చేసిన వ్యాఖ్యల రిజల్ట్
2023 సెప్టెంబర్‌లో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల సమయంలో దిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ (సౌత్‌ దిల్లీ) రమేశ్‌ బిధూరీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్​పీ)కి చెందిన ఎంపీ డానిష్‌ అలీని అసభ్య పదజాలంతో దూషించారు. వీటిపై విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. అంతేకాకుండా బీజేపీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సైతం రమేశ్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరకు బీజేపీ కూడా ఆయనకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. మూడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎంపీగా పని చేసినప్పటికీ తాజా ఎన్నికల్లో ఆయనను కమల దళం పక్కన పెట్టింది.

ఇలా వివిధ రాష్ట్రాల్లో అనేకమంది సీనియర్​ నాయకులకు కూడా బీజేపీ టికెట్ నిరాకరించింది. పలుచోట్ల సిట్టింగ్‌లను కాదని కొత్త వారికి అవకాశమిచ్చింది. ఝార్ఖండ్‌లో బీజేపీ మాజీ నేత యశ్వంత్‌సిన్హా కుమారుడు జయంత్‌కు టికెట్‌ ఇవ్వలేదు. అదే రాష్ట్రంలో 3 సార్లు ఎంపీగా పనిచేసిన సుదర్శన్‌ భగత్‌కు అవకాశం ఇవ్వలేదు. పర్వేశ్‌సింగ్‌ వర్మ, మీనాక్షి లేఖి, వరుణ్‌గాంధీ, అశ్వినీ చౌబే వంటి సిట్టింగ్‌లకు టిక్కెట్లు దక్కలేదు.

అమ్మకు టికెట్​- కుమారుడికి నో- పార్టీలో చేరిన గంటల్లోనే సీటు- సందేశ్​ఖాలీ బాధితురాలికి చోటు

లోక్‌సభ బరిలో బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​- 111మందితో బీజేపీ ఐదో జాబితా విడుదల

ABOUT THE AUTHOR

...view details