JDU National Executive Meeting :జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా నియమితులయ్యారు. దిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన జేడీయూ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతేకాకుండా ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. బిహార్కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ, నీట్ పరీక్ష పేపర్ లీక్ దోషులపై కఠిన చర్యలు, భవిష్యత్తులో పేపర్ లీక్ ఘటనలు పునరావృతం కాకుండా చట్టం, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పోటీ, వచ్చే ఏడాది బిహార్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నీతీశ్ కుమార్ నేతృత్వంలో పార్టీ విజయం సాధించడం వంటి తీర్మానాలు చేశారు. జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్, కేంద్ర మంత్రులు లాలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకుర్, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.
మోదీకి బిహార్పై ప్రత్యేక శ్రద్ధ
జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం అయిన తర్వాత సంజయ్ ఘా తొలిసారిగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ బిహార్పై ఎల్లప్పుడూ శ్రద్ధ చూపుతారని, తమ ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ డిమాండ్ నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో పార్టీని విస్తరించేందుకు కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. వచ్చే ఏడాది జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ- బీజేపీ కూటమి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని బలాలతో ముందుకొస్తుందని పేర్కొన్నారు. కాగా, జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన సంజయ్ ఝాకు బీజేపీ అధినాయకత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి. కేంద్రం నుంచి మరిన్ని నిధులను రాబట్టేందుకు, రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కాపాడేందుకు జేడీయూ ఆయన్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినట్లు తెలుస్తోంది.