India Plans To Develop 5.5 Generation Fighter Jet Prototype By 2028 : భారత్ సరికొత్త యుద్ధ విమానాలను సిద్ధం చేస్తోంది. వైమానిక దళంలో అతికొద్ది దేశాల వద్ద ఉన్న స్టెల్త్ రకం యుద్ధ విమానాలను 'రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ' (డీఆర్డీఓ) అభివృద్ధి చేస్తోంది. 5.5 జనరేషన్ స్టెల్త్ ఫైటర్ నమూనాను ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ 2024లో డీఆర్డీఓ ప్రదర్శించింది. 2028 నాటికి దీని నమూనా అభివృద్ధి చేయనున్నారు. 2035 నాటికి ఇవి భారత్ అమ్ములపొదిలో చేరనున్నాయి. ఈ యుద్ధ విమానం సిద్ధమైతే, స్టెల్త్ ఫైటర్ల సాంకేతికత కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ నిలవనుంది.
Published : Aug 29, 2024, 7:39 PM IST
2035 నాటికి భారత అమ్ములపొదిలో 5.5 జనరేషన్ స్టెల్త్ ఫైటర్! - FIGHTER JET PROTOTYPE OF INDIA
India Plans To Develop 5.5 Generation Fighter Jet Prototype By 2028 : రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో దూసుకెళుతున్న డీఆర్డీఓ భవిష్యత్ తరం స్టెల్త్ రకం ఫైటర్ జెట్ల అభివృద్ధిని వేగవంతం చేసింది. 5.5 జనరేషన్ స్టెల్త్ ఫైటర్ నమూనాను ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ 2024లో ప్రదర్శించింది. 2035 నాటికి భారత అమ్ములపొదిలో ఈ 5.5 జనరేషన్ స్టెల్త్ ఫైటర్ చేరనుంది.
2028 నాటికి ప్రోటోటైప్
డీఆర్డీఓ ప్రస్తుతం అత్యాధునిక 5.5 జనరేషన్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్-ఏఎంసీఏ (AMCA)ను అభివృద్ధి చేస్తోంది. 2028 నాటికి దీని ప్రాథమిక వెర్షన్ను సిద్ధం చేయాలని చూస్తోంది. తమిళనాడులోని సూలూరులో జరిగిన ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ 2024లో ఏఎంసీఏ ఫైటర్ జెట్ నమూనాను డీఆర్డీఓ ప్రదర్శించింది. వైమానిక దళంలో అతికొద్ది దేశాల వద్ద ఉన్న ఈ స్టెల్త్ రకం యుద్ధ విమానాలను దేశీయంగా అభివృద్ధి చేస్తున్నట్లు డీఆర్డీఓ తెలిపింది. ప్రపంచంలో అతి కొద్ది దేశాలకే పూర్తి స్థాయి స్టెల్త్ పైటర్ల సాంకేతికత పరిమితమైందని, అతి త్వరలో భారత్ ఆ దేశాల సరసన చేరనుందని పేర్కొంది. 27 టన్నుల బరువు ఉండే ఈ ఏఎంసీఏ విమానాలు క్షిపణులు సహా భారీ ఆయుధ సామాగ్రిని మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని తెలిపింది. ఇంజిన్ ఉత్పత్తి, ఇతర కార్యకలాపాలు సకాలంలో పూర్తి అయితే దీని మెుదటి ప్రొటోటైప్ 2028 నాటికి సిద్ధంగా ఉంటుందని డీఆర్డీఓ వెల్లడించింది.
అజేయ శక్తిగా భారత్
భారత్ వైమానిక దళాన్ని అజేయ శక్తిగా మార్చనున్న స్టెల్త్ యుద్ధ విమానాల సాంకేతిక అభివృద్ధి దేశానికి గర్వ కారణమని డీఆర్డీఓ ఛైర్మన్ సమీర్ వి కామత్ అన్నారు. భారత వైమానిక దళంలో ఇప్పటి వరకు స్టెల్త్ రకం యుద్ధవిమానాలు, అభివృద్ధి సాంకేతికతలు లేవని తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఏఎంసీఏ 2034 నాటికి ట్రయల్స్ పూర్తి చేసుకోనున్నట్లు ఆయన చెప్పారు. 2035 నాటికి వీటిని వైమానిక దళంలో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. తమిళనాడులో జరిగిన ఐడాక్స్ 2024లో డీఆర్డీఓ దేశీయంగా అభివృద్ధి చేసిన 40కి పైగా అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శించింది.