తెలంగాణ

telangana

ఎన్నికల పక్రియ నిర్వీర్యానికి కుట్రలంటూ ఈసీకి బీజేపీ ఫిర్యాదు- అలానే లెక్కించాలని 'ఇండియా' విజ్ఞప్తి - lok sabha election 2024

By ETV Bharat Telugu Team

Published : Jun 2, 2024, 6:19 PM IST

Updated : Jun 2, 2024, 7:33 PM IST

INDIA Block Delegation Meets ECI : పోస్టల్​ బ్యాలెట్లను మొదటగా లెక్కించి, ఫలితాలను ప్రకటించిన తర్వాతే ఈవీఎంలు తెరవాలని ప్రతిపక్ష నేతలు ఈసీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు బీజేపీ బృందం సైతం ఈసీని కలిసి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుని బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరింది.

INDIA Block Delegation Meets ECI
INDIA Block Delegation Meets ECI (ANI)

INDIA Block Delegation Meets ECI : లోక్​సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశాయి. ఆదివారం సాయంత్రం వేర్వేరుగా ఎన్నికల కమిషనర్లను కలిసి పలు విజ్ఞప్తులు చేశారు ఇరు పక్షాల నేతలు. పోస్టల్​ బ్యాలెట్​ లెక్కింపు తర్వాత ఈవీఎంలను తెరవాలని కాంగ్రెస్​ ఈసీని కోరింది. అనంతరం ఈసీని కలిసిన బీజేపీ బృందం, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుని బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరింది.

పోస్టల్​ బ్యాలెట్లను మొదటగా లెక్కించి, ఫలితాలను ప్రకటించిన తర్వాతే ఈవీఎంలు తెరవాలని ప్రతిపక్ష నేతలు ఈసీకి విజ్ఞప్తి చేశారు. కండక్ట్​ ఆఫ్​ ఎలక్షన్​ రూల్స్​ 1961 ప్రకారం సెక్షన్​ 54 ఏ నిబంధనను కచ్చితంగా పాటించాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధనను అనేక ఏళ్లుగా ఎన్నికల సంఘం అనుసరిస్తుందని, కానీ 2019లో దీనికి స్వస్తి చెప్పారని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిష్పపక్షపాతంగా నిర్వహించాలని కోరినట్లు చెప్పారు. ఈసీని కలిసిన వారిలో కాంగ్రెస్​ నేత అభిషేక్​ సింఘ్వీతో పాటు సీపీఐ నేత డీ రాజా, సీపీఏం నేత సీతారాం ఏచూరి సహా పలు పార్టీల నేతలు ఉన్నారు.

"మొదటగా పోస్టల్ బ్యాలెట్​ను లెక్కించి ఫలితాలు ప్రకటించాలి. ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్​ను ప్రారంభించాలని చట్టం చెబుతోంది. కానీ 2019 లెక్కింపులో అనుసరించలేదు. ఇప్పుడు ఆ నిబంధనను కచ్చితంగా పాటించాలని డిమాండ్ చేశాం. మా డిమాండ్​ను ఈసీ పరిగణనలోకి తీసుకుంది. వారి నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం. 2023లో జరిగిన మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఏ ఎగ్జిట్ పోల్​ కూడా అంచనా వేయలేదు. బంగాల్​లో చెప్పినన్ని సీట్లను బీజేపీ గెలిచిందా? ఎగ్జిట్​ పోల్స్​ కన్నా పీపుల్స్ పోల్స్​ ముఖ్యం. మా అంచనా ప్రకారం సుమారు 290-295 సీట్లు గెలుస్తున్నాం."

--అభిషేక్​ సింఘ్వీ, కాంగ్రెస్ నేత

ఈసీని కలిసిన బీజేపీ బృందం
కాసేపటికే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ నేతృత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం సైతం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. కాంగ్రెస్ సహా కొన్ని పౌర సంఘాలు ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. దీంతో పాటు ఎన్నికల సంఘం ప్రోటోకాల్​ను తప్పనిసరిగా పాటించాలని ఈసీని కోరినట్లు కేంద్ర మంత్రి పీయూశ్​ గోయల్​ చెప్పారు. కౌంటింగ్, ఫలితాల వెల్లడి సమయంలో పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియను నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న కుట్రలను గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Last Updated : Jun 2, 2024, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details