IAS Officers Approached To CAT :కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఆదేశాలతో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ అధికారులు పునర్విభజన యాక్ట్ ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు డీఓపీటీ కార్యదర్శి ఆర్డర్స్ సైతం జారీ చేశారు. అయితే డీఓపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ పలువురు ఐఏఎస్ అధికారులు ఇవాళ క్యాట్ను ఆశ్రయించారు.
డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, సృజన క్యాట్లో వేర్వేరుగా పిటిషన్లు ఫైల్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి కోరగా, ఏపీలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ అధికారిణి సృజన విన్నవించారు. ఈ పిటిషన్లపై క్యాట్ మంగళవారం విచారణ చేపట్టనుంది.
ఏపీకి కేటాయించి తెలంగాణలో కొనసాగుతున్న వారిలో ఐఏఎస్ ఆఫీసర్స్ వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతి, ఐపీఎస్ కేడర్కు చెందిన అధికారులు అంజనీ కుమార్, అభిలాశ్ బిస్త్, అభిషేక్ మహంతి ఉన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన వారిలో ఐఏఎస్ ఆఫీసర్లు సృజన, శివశంకర్, హరికిరణ్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్లాలని అప్లికేషన్ పెట్టుకున్న ఎస్.ఎస్.రావత్, అనంతరాము అభ్యర్థనలను డీవోపీటీ రిజక్ట్ చేసింది. వీరిద్దరూ ఏపీలోనే కొనసాగుతారు.