తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​కు డబుల్​ AI ప్రయోజనం​- హరియాణా ఫలితాలతో సుస్థిరత సందేశం'

హరియాణా ఎన్నికల ఫలితాలపై మోదీ స్పందన- సుస్థిరతను మరింత బలపరిచారన్న ప్రధాని

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

PM Modi On Haryana Results
PM Modi On Haryana Results (ANI)

PM Modi On Haryana Results :భారత ప్రజలు తమ ప్రభుత్వానికి వరుసగా మూడుసార్లు అధికారాన్ని కట్టబెట్టడం ద్వారా సుస్థిరత సందేశాన్ని ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన హరియాణా ఎన్నికల్లో ఆ సుస్థిరతను మరింత బలపరిచారని తెలిపారు. భారత్‌ వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా మోదీ అభివర్ణించారు. పేదల కష్టాలు తమకు బాగా తెలుసని అన్నారు. దిల్లీలో సోమవారం జరిగిన ఎన్​డీటీవీ వరల్డ్ సమ్మిట్​లో ఈ వ్యాఖ్యలు చేశారు.

సంక్షోభ సమయాల్లో భారత్ అందరికీ సహాయం చేసిందని, కొవిడ్ మహమ్మారి సమయంలో అనేక దేశాలకు వ్యాక్సిన్‌లను పంపినట్లు గుర్తుచేశారు మోదీ. భారత్​ ప్రతి రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. తమ దేశానికి డబుల్ AI ప్రయోజనం ఉందని తెలిపారు. ఒక AI ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అయితే, మరొకటి యాస్పిరేషనల్ ఇండియా అని చెప్పారు. భారతీయుల ప్రతిభ, కృత్రిమ మేధస్సు కలిసినప్పుడు అభివృద్ధి వేగంగా జరగడం సహజమని అన్నారు. అప్పట్లో పారిశ్రామిక విప్లవాల ప్రయోజనాన్ని భారత్ పొందలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అవసరమైన నైపుణ్య, మౌలిక సదుపాయాలను నిర్మించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

తమ ప్రభుత్వం ఇప్పటికే 125 రోజులు పూర్తి చేసుకుందని తెలిపారు మోదీ. భవిష్యత్​ ఆలోచనతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, 2047 నాటికి వికసిత్ భారత్ తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ 125 రోజుల్లో పేదలకు 3 కోట్ల కొత్త పక్కా గృహాలు ఇచ్చామని, రూ.9 లక్షల కోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్టులపై పని మొదలైందని చెప్పారు. 15 వందే భారత్‌ రైళ్లు ప్రారంభించామని, 8 కొత్త ఎయిర్‌ పోర్టుల పనికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.21 వేల కోట్లను బదిలీ చేశామని, 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యానికి ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో దాదాపు 7 శాతం వృద్ధి నమోదైందని, విదేశీ మారకద్రవ్యం 700 బిలియన్‌ డాలర్లను దాటేసిందని మోదీ తెలిపారు. 125 రోజుల కాలంలో జరిగిన టెలికామ్‌-డిజిటల్‌ ఫ్యూచర్‌పై అంతర్జాతీయ అసెంబ్లీ, గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌, గ్లోబల్‌ సెమీకండెక్టర్‌ ఎకోసిస్టమ్‌పై సదస్సు భారత్‌ దిశ ప్రపంచం ఆశను తెలియజేస్తున్నాయని అన్నారు. ప్రపంచ భవిష్యత్తును భారత్‌ నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ మూడో విడత పాలనతో రేటింగ్‌ ఏజెన్సీలు దేశ వృద్ధి రేటు అంచనాలను గణనీయంగా పెంచాయిని మోదీ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details