తెలంగాణ

telangana

'జూన్‌ 25న రాజ్యాంగ హత్యాదినం'- ఎమర్జెన్సీకి గుర్తుగా కేంద్రం కీలక నిర్ణయం - Samvidhan hatya divas

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 4:33 PM IST

Updated : Jul 12, 2024, 5:27 PM IST

Samvidhan Hatya Divas : ఎమర్జెన్సీ విధించి ఇటీవలె 50ఏళ్లు పూర్తైన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్‌ 25న రాజ్యాంగ హత్యాదినం జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఎక్స్‌ ద్వారా ప్రకటించారు.

Samvidhan hatya divas
Samvidhan hatya divas (ANI)

Samvidhan Hatya Divas :దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్‌ 25న రాజ్యాంగ హత్యాదినంగా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన గెజిట్​ను శుక్రవారం విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఎక్స్‌ ద్వారా ప్రకటించారు. 1975 జూన్‌ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించటం ద్వారా తన నియంతృత్వ ధోరణిని ప్రదర్శించటమే కాకుండా ప్రజాస్వామ్య ఆత్మను ఉరితీశారని ఆరోపించారు. ఏ తప్పూ చేయకపోయినా లక్షలాది మందిని జైళ్లలోకి తోశారని, మీడియాపై ఆంక్షలు విధించారని విమర్శించారు. అందువల్ల ప్రతి ఏడాది జూన్‌ 25న సంవిధాన్‌ హత్యా దినంగా జరపాలని మోదీ సర్కార్‌ నిర్ణయించినట్లు అమిత్‌ షా తెలిపారు. అత్యవసర పరిస్థితి సమయంలో ఎన్నో బాధలు అనుభవించిన వారిని స్మరించుకునే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు.

ప్రధాని మోదీ హర్షం
కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అప్పటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్‌ హత్య దివస్‌ మనకు గుర్తు చేస్తుందన్నారు. దేశ చరిత్రలో కాంగ్రెస్‌ రాసిన చీకటి దశ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ స్మరించుకునే రోజు ఇది అని ప్రధాని అభిప్రాయపడ్డారు.

హెడ్​లైన్లలో నిలవడం కోసమే
మరోవైపు ఎమర్జెన్సీ విధించిన రోజును రాజ్యాంగ హత్యాదినంగా నిర్వహించాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్​ తప్పుబట్టింది. ఇది కేవలం హెడ్​లైన్లలో నిలవడానికి ప్రధాని మోదీ వేసిన ఎత్తుగడగా అభిప్రాయపడింది. పదేళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ విధించిన ప్రధాని మోదీని జూన్​ 4న నైతికంగా ప్రజలు ఓడించారని, ఆ రోజు మోదీ ముక్త్​ దివస్​గా చరిత్రలో నిలిచిపోతుందని ఎద్దేవా చేసింది. ఈ నిర్ణయం దేశ రాజ్యాంగం విలువలు, సంప్రదాయాలు, సంస్థలపై క్రమబద్దంగా చేస్తున్న దాడి అని కాంగ్రెస్​ సీనియర్ నేత జైరాం రమేశ్​ ఆరోపించారు.

సుప్రీం తీర్పు వచ్చిన వెంటనే ఎమర్జెన్సీ
రాష్ట్రపతి దేశవ్యాప్త ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు 1975 జూన్‌ 25వ తేదీ అర్ధరాత్రి అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీంకోర్టు వెలువరించిన కొద్దిసేపటికే ఇందిరా గాంధీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Last Updated : Jul 12, 2024, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details